పాక్కు ఆంధ్రా మిర్చితో ఘాటెక్కించాం, గణేషుడి కళ్లు చిన్నవిగా: పారికర్
న్యూఢిల్లీ: ఆంధ్రా మిర్చి ఘాటుతో పాకిస్తాన్కు మంట ఎక్కించామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా.. ఉగ్రవాదుల పైకి ఉగ్రవాదులనే ప్రయోగిస్తున్నామని గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం పాకిస్తాన్ పైన మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి మీడియా ప్రశ్నించింది. ఆయన మాట్లాడుతూ.. తీవ్రవాదులకు తీవ్రవాదులతోనే అనే మాటతో పాకిస్తాన్కు మంటెక్కించామని, ఆంధ్రా మిర్చితో మంటెక్కించామని చెప్పారు.
దీంతో పాకిస్తాన్కు ఏ స్థాయిలో మండుతోందనేది మాత్రం తాను చెప్పనని అన్నారు.
పాకిస్తాన్లో కాశ్మీర్ విడదీయరాని భాగమని, దేశ విభజనకు సంబంధించిన ఈ అజెండా ఇంకా ముగియలేదని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ను ఉటంకిస్తూ ఆ దేశ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ సలీమ్ ట్వీట్ చేశారు. దీనిపై పారికర్ పైవిధంగా స్పందించారు.
గణేషుడి కళ్లు చిన్నగా అవుతున్నాయి
మేకిన్ ఇండియాకు చెందిన ఓ సదస్సులో మాట్లాడుతూ.. తనకు తరుచూ వచ్చే బహుమతుల్లో దేవతామూర్తులు ఎక్కువగా ఉంటాయని, ముఖ్యంగా గణేషుడి ప్రతిమలు అధికమని చెప్పారు. అయితే, ఈ మధ్య కాలంలో గణేషుడి ప్రతిమల కళ్లు చిన్నగా ఉంటున్నాయన్నారు.
ఓ రోజు ఏదో యథాలాపంగా తనకు వచ్చిన గణేష ప్రతిమను వెనక్కి తిప్పి చూస్తే.. చైనాలో తయారీ అని ముద్రించి ఉండటం కనిపించిందని చెప్పారు. చివరకు దేవతామూర్తులను కూడా చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు.