‘కుందేలు వేటకు వెళ్లినా.. పులిని ఎదుర్కొవాల్సిందే’: తల్లి మాట గుర్తు చేసుకున్న పారికర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం, దాని సరిహద్దులు పూర్తి రక్షణలో ఉంటాయని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. సర్జికల్ దాడులకు మద్దతుగా నిలిచిన విపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పాక్తో ఎలాంటి ఉద్రిక పరిస్థితులు తెలెత్తినా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు.
ఈ సందర్భంగా తన తల్లి గతంలో తనతో చెప్పిన ఓ మాటను ఆయన గుర్తు చేసుకున్నారు. 'కుందేలును వేటాడటం కోసం అడవిలోకి వెళ్లినప్పుడు, పులిని కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి' అని తన తల్లి తరచూ చెప్పేదని ఒక న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పారికర్ తెలిపారు.
యూరీ సైనిక శిబిరంపై సెప్టెంబర్ 18న జరిగిన దాడి, ఇందుకు ప్రతిగా 29వ తేదీన సరిహద్దు కావల ఉన్న ఉగ్ర శిబిరాలపై భారత్ లక్షిత దాడి అనంతరం నియంత్రణ రేఖ వెంట ఉద్రిక్త పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. 'భారత్ సైన్యం జరిపిన లక్షిత దాడి విజయవంతమైంది. అంతకు మించి కామెంట్ చేయలేను. ఆ వివరాలను డీజీఎంఓ ఇప్పటికే తన ప్రకటనలో వివరించారు' అని పారికర్ తెలిపారు.
పాక్కు చైనా వత్తాసు పలుకుతుండటంపై స్పందిస్తూ.. ఒకదేశంతో మరో దేశం సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఆ దేశం ఇంకొకరితో సన్నిహితంగా ఉండకూడదనేమీ లేదని, ఏళ్ల తరబడి చైనా, భారత్ సంబంధాలు మెరుగుపడుతూనే ఉన్నాయని చెప్పారు.
'కొన్ని విషయాల్లో ఆందోళనలు ఉన్నమాట నిజమే. అయితే చైనాతో భారత్ సంబంధాలు ఇవాళ మెరుగ్గానే ఉన్నాయి. సరిహద్దు నిర్వహణ (బోర్డర్ మేనేజిమెంట్) మెరుగ్గా ఉంది. పరస్పర విశ్వాసాన్ని పాదుకొలిపే చర్యలు తీసుకుంటూనే ఉన్నాం' అని ఆయన స్పష్టం చేశారు.
ఇండియాతో తగవు విషయంలో పాకిస్తాన్ వైపే చైనా ఉంటుందని పాక్ మీడియా కథనాలను చైనా ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా పారికర్ గుర్తుచేశారు. ఉగ్రవాదానికి ఒక దేశం కొమ్ముకాస్తోందని ప్రపంచ అగ్ర దేశాలన్నింటికీ తెలుసని, టెర్రరిజంపై పోరులో భారత్కు ఇప్పుడు అంతర్జాతీయ మద్దతు బాగా పెరిగిందని వివరించారు.