ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది పూర్తి: అనూహ్య మార్పు: కాశ్మీర్ కొత్త గవర్నర్గా కేంద్ర మాజీమంత్రి
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన జమ్మూ కాశ్మీర్కు కొత్త లెప్టినెంట్ గవర్నర్ నియమితులు అయ్యారు. మనోజ్ సిన్హాను కొత్తగా లెప్టినెంట్ గవర్నర్గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నోటిఫికేషన్ జారీ చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట కన్నుమూత: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జర్నలిస్ట్
కేంద్ర మాజీ మంత్రికి కాశ్మీర్ బాధ్యతలు..
ఇప్పటిదాకా లెప్టినెంట్ గవర్నర్గా పని చేసిన గిరీష్చంద్ర ముర్ము స్థానంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి మనోజ్ సిన్హా నియమితులు అయ్యారు. బుధవారం రాత్రి గిరీష్ చంద్ర తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందజేశారు. ఆ రాజీనామా పత్రాన్ని రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ముర్ము స్థానంలో మనోజ్ సిన్హాను నియమించారు. త్వరలోనే ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ముర్ము రాజీనామా చేయడానికి కారణాలు ఏమిటనేది ఖచ్చితంగా తెలియరావట్లేదు.
కాగ్ డీజీగా ముర్ము..
ఆయనను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) డైరెక్టర్ జనరల్గా నియమించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ కారణంతోనే ముర్ము రాజీనామా చేశారని అంటున్నారు. ప్రస్తుతం కాగ్ డైరెక్టర్ జనరల్గా ఉన్న రాజీవ్ మెహ్రిషి ఈ వారంలో పదవీ విరమణ చేయబోతున్నారు. రాజీవ్ స్థానంలో ముర్మును నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు.కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ మెహ్రిషి 2017 సెప్టెంబర్ 25వ తేదీన కాగ్ డీజీగా బాధ్యతలను స్వీకరించారు.
గుజరాత్ కేడర్కు చెందిన ముర్ము..
1985 బ్యాచ్ గుజరాత్ క్యాడర్కు చెందిన ఐఎఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్ము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. పలు కీలక శాఖల్లో ముఖ్య కార్యదర్శి హోదాలో ముర్ము పనిచేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన జమ్మూ కాశ్మీర్కు మొట్టమొదటి లెప్టినెంట్ గవర్నర్గా ముర్ము నియమితులు అయ్యారు. గత ఏడాది అక్టోబర్లో ఆయన బాధ్యతలను స్వీకరించారు.
Recommended Video
బీజేపీ నేతగా..
కాగా.. ముర్ము స్థానంలో మనోజ్ సిన్హాను నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మనోజ్ సిన్హా.. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు. ఉత్తర ప్రదేశ్కు చెందిన నాయకుడు. ఘాజీపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు విజయం సాధించారు. ఎన్డీఏ-1 హయాంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా పని చేశారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. బహుజన్ సమాజ్వాది పార్టీ అభ్యర్థి అఫ్జల్ అన్సారీ చేతుల్లో ఓటమి చవిచూశారు.