ఉప ముఖ్యమంత్రి పని ఫినిష్ ? ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ చాన్స్ లేదు, రాజీనామా ఒక్కటే !
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్మణ సవది అమోమయంలో పడిపోయారు. బీజేపీ హైకమాండ్ పెద్దలకు, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వర్గీయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది. ఇదే సమయంలో కర్ణాటకకు చెందిన అనేక మంది బీజేపీ నాయకులు ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది మీద మండిపడుతున్నారు. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో ఉప ముఖ్యమంత్రి లక్షణ సవది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మణ సవది గత బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సాటి ఇద్దరు మంత్రులతో కలిసి పొర్న్ వీడియోలు చూశారని ఆరోపణలు రావడంతో అప్పట్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు : 1000కిపైగా వీడియోలు.. మాజీ సీఎం, గవర్నర్, సినీతారల లీలలు
అన్ని తలుపులు క్లోజ్ ?
లక్ష్మణ సవది ఎమ్మెల్యే కాదు, కనీసం ఎమ్మెల్సీ కాదు, అయినా పెద్దల ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు లక్ష్మణ సవది ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఏ నియోజక వర్గం ఖాళీ లేదు. కనీసం ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటే ప్రస్తుత ఎమ్మెల్సీలు రాజీనామాలు చెయ్యడానికి ఎవ్వరూ సిద్దంగా లేరు. అదే జరిగితే ఉప ముఖ్యమంత్రి పదవికి లక్ష్మణ సవది రాజీనామా చెయ్యాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చిత్తుగా ఓడిపోతే డీసీఎం పదవి !
2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో లక్ష్మణ సవది అథణి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేష్ కుమటళ్ళి చేతిలో లక్ష్మణ సవది ఓడిపోయారు. ఇదే సమయంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సహకరించిన రెబల్ ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో అథణి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో తుస్ !
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదికి ఇటీవల జరిగిన మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కొన్ని నియోజక వర్గాలు అప్పగించారు. అయితే అక్కడా లక్ష్మణ సవది సత్తా చాటుకోలేకపోయారు. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో అప్పగించిన పని సక్రమంగా చెయ్యలేదని ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది మీద బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
అనర్హత ఎమ్మెల్యేలపై విమర్శలు
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయి బీజేపీ అధికారంలోకి రావడానికి అనర్హత ఎమ్మెల్యేలు కారణం. అలాంటి అనర్హత ఎమ్మెల్యేల విషయంలో లక్ష్మణ సవది నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ వారి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు బీజేపీ నాయకులు ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది తీరుపై అసహం వ్యక్తం చేస్తున్నారు.
ఉప ఎన్నికల్లో నో చాన్స్
కర్ణాటకలోని 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో డిసెంబర్ 5వ తేదీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అథణి నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మణ సవది ఓడిపోయారు. అథణి ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హత ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళికి టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులు దాదాపు నిర్ణయించి ఆయనకు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ సమయంలో లక్ష్మణ సవది అథణి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి అవకాశం లేదు.
ఎమ్మెల్యేల మొండిపట్టు
ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీలు వారి పదవులకు రాజీనామా చేసి లక్ష్మణ సవదిని పోటీ చేయించడానికి సిద్దంగా లేరు. రాజీనామాలు చెయ్యడానికి మేము అంగీకరించమని కొందరు ఎమ్మెల్సీలు ఇప్పటికే తేల్చి చెప్పారని తెలిసింది. ఉప ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోయినా, ఎమ్మెల్సీ చాన్స్ రాకపోయినా లక్ష్మణ సవది కచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది.
మేము మగాళ్లు కాదా ?
బెళగావి జిల్లాలో అనేక మంది బీజేపీ నాయకులు ఉన్నారు. అయితే లక్ష్మణ సవదికి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అని కొందరు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మణ సవది ఎమ్మెల్యే కాదు, కనీసం ఎమ్మెల్సీ కాదు, అలాంటిది ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, మంత్రి పదవులకు మేము అనర్హులమా, మేము మగాళ్లు కాదా అని కొందరు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది ఏం చేస్తారు ? అనే విషయం అంతు చిక్కక ఆయన వర్గీయులు తలలు పట్టుకుంటున్నారు.