ఓట్ల లెక్కింపుపై ఎన్నో అనుమానాలు.. ఇంతకు ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా?
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోననే చర్చలు జోరందుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు పట్టం కట్టినా.. ఓటర్ల నాడి వెలువడే మే 23వ తేదీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఓటర్ దేవుళ్లు ఓటు రూపంలో తమ అభిప్రాయాన్ని నిక్షిప్తం చేసిన ఈవీఎంలు అభ్యర్థులు గెలుపోటములను బహిర్గతం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపుపై చాలామందికి అనుమానాలున్నాయి. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతుందనే సందేహాలున్నాయి.
ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి.. ఆన్లైన్ గేమ్స్ చెలగాటం..!
మొదటి దశ
ఎన్నికల కౌంటింగ్లో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్దేశించిన పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలట్ సిస్టమ్ (ETPBS) ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించాక.. పోస్టల్ ద్వారా వచ్చిన ఓట్లు కౌంట్ చేస్తారు. దాదాపు ఈ ప్రక్రియ మొదటి అరగంటలో పూర్తవుతుంది. ఉదయం 8 గంటలకు ఈ ప్రాసెస్ మొదలు పెడతారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లన్నీ ఒక దగ్గర రాశులుగా పోస్తారు. అనంతరం వాటిని 25 చొప్పున కట్టలుగా కడతారు. ఒక్కో కౌంటింగ్ టేబుల్కు రౌండ్స్ చొప్పున ఒక్కో రౌండ్కు గరిష్ఠంగా 20 కట్టలు అంటే 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కేటాయిస్తారు. నిమిషం వ్యవధిలో మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగలరనేది ఓ అంచనా. అదలావుంటే ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో దాదాపు 14 వేల వరకూ పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయని అంచనా. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకుండా కంట్రోల్ యూనిట్లకు సంబంధించి అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించకూడదనేది ఒక కండిషన్. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ తంతు 8.30 గంటలు దాటినా పూర్తికాకపోయినప్పటికీ.. అటు ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్లలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేస్తారు.
రెండవ దశ
పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో సంబంధం లేకుండా.. ఉదయం 8.30 గంటలకు ఈవీఎం కంట్రోల్ యూనిట్స్లలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. అయితే ఆయా సెగ్మెంట్లను బట్టి ఎన్ని రౌండ్లు ఉంటాయో నిర్ణయిస్తారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యతో పాటు పోలైన ఓట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు ఎంతమేర రౌండ్లు అవసరమో తేల్చుతారు.
ఒక్కో రౌండ్ లెక్కించడానికి సాధారణంగా ఎక్కువలో ఎక్కువ 30 నిమిషాలు పడుతుంది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి 14-15 కౌంటింగ్ టేబుళ్లు ఉంటాయి. ఒక్కో టేబుల్కు అసెంబ్లీ నియోజకవర్గాల క్రమసంఖ్యను బట్టి ఒక్కో కంట్రోల్ యూనిట్ను కేటాయిస్తారు. మొత్తం 14 టేబుళ్లకు సంబంధించి కంట్రోల్ యూనిట్ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండు పూర్తయినట్లు పరిగణిస్తారు. ఆ తర్వాత 15 నుంచి 29 వరకు క్రమసంఖ్యలో ఉన్న పోలింగ్ కేంద్రాల కంట్రోల్ యూనిట్లు లెక్కింపు చేపడతారు. అలా మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలుంటే అన్ని రౌండ్లు ఉంటాయన్నమాట.
ఓట్ల లెక్కింపు సందర్భంగా కంట్రోల్ యూనిట్లకు సంబంధించి బ్యాటరీలు పనిచేయకున్నా.. ఒకవేళ అవి తెరుచుకోకుండా మొరాయించినా.. వాటిని పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత వరుసలో ఉన్న పోలింగ్ కేంద్రాల కంట్రోల్ యూనిట్ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక.. పనిచేయని కంట్రోల్ యూనిట్లకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తారు. అది కూడా ఎన్నికల సంఘం అనుమతితో ఆ తంతు పూర్తి చేస్తారు.
మూడో దశ
కంట్రోల్ యూనిట్లకు సంబంధించి చివరి రౌండు పూర్తయ్యాకే.. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపడతారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నారు ఎన్నికల అధికారులు. దాని ప్రకారం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సి ఉంటుంది. అయితే ఏయే పోలింగ్ కేంద్రాలను ఎంచుకోవాలనే విషయంలో తర్జనభర్జన లేకుండా లాటరీ ద్వారా నిర్ణయిస్తారు.
లాటరీ సిస్టమ్ ద్వారా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈవీఎంలు మొరాయించిన కంట్రోల్ యూనిట్లకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను మినహాయిస్తారు. అలాగే పోలింగ్ సమయంలో ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అవగాహన కోసం నిర్వహించే నమూనా ఓటింగ్ ప్రక్రియ ద్వారా నమోదైన వీవీ ప్యాట్లను కొన్ని చోట్ల తొలగించలేదని తెలుస్తోంది. అలాంటి వాటిని కూడా లాటరీ సిస్టమ్లోకి తీసుకోరు.
తేడా వస్తే.. వీవీప్యాట్ స్లిప్పులే ఫైనల్
ఇక ఓట్ల లెక్కింపులో చివరి దశ వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్. గుర్తుల వారీగా బాక్సులు ఏర్పాటు చేసి.. ఆయా పార్టీలకు వచ్చిన స్లిప్పులను అందులో వేస్తారు. అనంతరం వాటిని లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్ యంత్రానికి సంబంధించిన స్లిప్పులు లెక్కించాలంటే గరిష్ఠంగా గంట సమయం పట్టే అవకాశముంది.
వీవీప్యాట్లు లెక్కించేటప్పుడు అన్నీ గంపగుత్తగా ఒకేసారి లెక్కించరు. ఒకటి అయిపోయాక మరొకటి తెరుస్తారు. అలా ఐదు వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యేసరికి కనీసం ఐదుగంటలైనా పడుతుంది. ఒకవేళ ఈవీఎం కంట్రోల్ యూనిట్ లెక్కలకు.. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కలకు తేడా వస్తే.. ఆ స్లిప్పులను మరోసారి లెక్కిస్తారు. అలా రెండు, మూడు సార్లు లెక్కించినా కూడా.. అలాగే డిఫరెన్స్ కనిపిస్తే మాత్రం వీవీప్యాట్ స్లిప్పులనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు వెల్లడిస్తారు.
రైతుబంధు సాయానికి లైన్ క్లియర్.. ఈ నెల చివరి నుంచి రైతుల ఖాతాలకు బదిలీ