VVIPల స్కాంలు, రాజకీయాలు అంటే జైలే గతి, ప్రధానికి ఓటు మీకు నోటు, సినిమా కష్టాలు!
న్యూఢిల్లీ: అనేక స్కాంల కేసుల్లో VVIPల జైలుకు వెళ్లారు. దేశ చరిత్రలో మొదటి సారి కేంద్ర మాజీ హోం మంత్రి పి. చిదంబరం అరెస్టు అయ్యారు. అయితే అంతకు ముందే వివిద కేసుల్లో ముఖ్యమంత్రులు, మంత్రులతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్లారు. కొందరు నాయకులు, అధికారులు బెయిల్ మీద బయటకు వచ్చారు. కొందరు మరణించడంతో ఆ కేసుల విచారణ అక్కడికి అంతం అయ్యాయి. వివిద కేసుల్లో జైలుకు వెళ్లిన కొందరు వీఐపీలు వీరే.
అమ్మ జయలలిత
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత జైలు జీవితం గడిపారు. 1991=96 మధ్య కాలంలో సీఎం పదవిలో ఉన్న జయలలిత అక్రమాస్తులు సంపాదించారని బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 2014లో జయలలితకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో 21 రోజులు శిక్ష అనుభవించిన జయలలిత తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం పదవిలో ఉన్న జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స విఫలమై మరణించారు. అంతకు ముందే జయలలిత జైలుకు వెళ్లారు. టీవీల కొనుగోలు స్కాం కేసులో 1998 డిసెంబర్ లో జయలలిత, శశికళ అరెస్టు అయ్యారు. ఇదే కేసు నుంచి 2000లో జయలలిత, శశికళ విముక్తి పొందారు.
సీఎం పదవిలో జైలుకు !
దక్షిణ భారతదేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీఎస్. యడియూరప్ప శక్తి వంచన లేకుండా పని చేశారు అనే పేరు ఉంది. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన యడియూరప్ప సీఎం అయ్యారు. అయితే సీఎంగా పూర్తి కాలం అధికారంలో ఉండటానికి యడియూరప్పకు అవకాశం లేకపోయింది. ప్రభుత్వ భూమి డినోటిఫై చేసే విషయంలో సీఎం పదవిలో ఉన్న సమయంలోనే యడియూరప్ప అరెస్టు అయ్యారు. బళ్లారి అక్రమ గనుల కేసులో యడియూరప్ప మీద ఆరోపణలు వచ్చాయి. యడియూరప్ప 25 రోజులు జైల్లో ఉన్నారు. ఈ కేసుల విషయంలో తీవ్ర ఒత్దిడికి గురైన యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. బళ్లారి అక్రమ గనుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు యడియూరప్ప మీద ఉన్న ఆరోపణలు కొట్టివేసి కేసు నుంచి విముక్తి కల్పించింది.
రూ. 900 కోట్ల గడ్డి స్కాం కేసు
ఒకటి కాదు రెండు కాదు, అనేక కేసుల్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రూ. 900 కోట్ల గడ్డి స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు కావడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇదే కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు 14 ఏళ్లు జైలు శిక్ష పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పని చేసే సమయంలో రైల్వే శాఖ భూమిని అక్రమంగా హోటల్ నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థకు అప్పగించారని లూలూ ప్రసాద్ యాదవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
2జీ స్కాం కేసులో రాజా
దేశ వ్యాప్తంగా కుదిపేసిన 2జీ స్కాం కేసులో కేంద్ర మాజీ టెలికం శాఖా మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2వ తేదీ అరెస్టు చేశారు. 15 నెలలు జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర టెలికం శాఖా మంత్రిగా పని చేసిన సమయంలో ఎ. రాజా అధికార దుర్వినియోగం చేశారని కేసు నమోదైయ్యింది.
కరుణానిధి కూతురు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీలో చక్రం తిప్పిన ఎం. కరుణానిధి కుమార్తె, ప్రస్తుత డీఎంకే పార్టీ ఎంపీ కనిమోళి 2జీ స్కాం కేసులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు. 2011లో సీబీఐ అధికారులు కనిమోళిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కుటుంబ సభ్యులు స్థాపించిన కలైనార్ టీవీలో భాగస్వామి అయిన కనిమోళి టీవీ చానల్ ప్రారంభించడం, తరువాత దానిని సులువుగా నిర్వహించడానికి అప్పటి కేంద్ర మంత్రి ఎ. రాజా సహకారం తీసుకున్నారని, అందులో అక్రమాలు జరిగాయని కేసు నమోదైయ్యింది.
ప్రధానికి ఓటు మీకు నోటు
సమాజ్ వాదీ పార్టీలో చక్రం తిప్పిన అమర్ సింగ్ ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారు. అమర్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మీద అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడు అయిన అమర్ సింగ్ మన్మోహన్ సింగ్ కు మద్దతుగా ఓటు వెయ్యాలని ముగ్గురు బీజేపీ ఎంపీలకు లంచం (ఓటుకు నోటు) ఇవ్వాలని ప్రయత్నించారని ఆరోపిస్తూ కేసు నమోదైయ్యింది. అనారోగ్యంగా ఉందని, తనను అరెస్టు చెయ్యకూడదని తప్పించుకుని తిరిగిన అమర్ సింగ్ బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నించారు. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో అమర్ సింగ్ అరెస్టు అయ్యారు. 13 రోజులు అమర్ సింగ్ తీహార్ జైల్లో ఉన్నారు.
ఆయుధాల కేసు
2001= 2002 మధ్య కాలంలో బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో నాసిరకం ఆయుధాలు కొనుగోలు చేసే కాంట్రాక్టు ఇప్పించారని, అందుకు బంగారు లక్ష్మణ్ రూ. లక్ష లంచం తీసుకున్నారని కేసు నమోదైయ్యింది. కేసు నమోదు కావడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవికి బంగారు లక్ష్మణ్ రాజీనామా చేశారు. ఢిల్లీ హై కోర్టు బంగారు లక్ష్మణ్ కు జైలు శిక్ష విధించింది. 2014లో బంగారు లక్ష్మణ్ మరణించారు.
కామన్వెల్త్ స్కాం
భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఓఎ) అధ్యక్షుడిగా ఉన్న సురేష్ కల్మాడి మీద కేసులు నమోదైనాయి. కామన్వెల్త్ క్రీడలు నిర్వహించే విషయంలో సురేష్ కల్మాడి అక్రమాలకు పాల్పడ్డారని కేసు నమోదు కావడంతో 2011లో సీబీఐ అధికారులు సురేష్ కల్మాడిని అరెస్టు చేశారు. 9 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్న సురేష్ కల్మాడి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు. భారత్ ఒలింపిక్ స్కాం కేసులో అరెస్టు అయిన సురేష్ కల్మాడిని 2016 డిసెంబర్ లో భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఓఎ) జీవిత కాల సభ్యుడిగా నియమించడం మరో వివాదానికి కారణం అయ్యింది.
అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా పని చేసిన ఎస్.పి. త్యాగి మీద కేసు నమోదైయ్యింది, అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాం కేసులో లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ 2016లో సీబీఐ అధికారులు ఎస్.పి. త్యాగిని అరెస్టు చేశారు. జైలు జీవితం గడిపిన ఎస్.పి. త్యాగి పాటియాల కోర్టులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు.