ఎన్ఎండీసీ గనులపై మావోల దాడి: 50 కోట్ల ఆస్తి నష్టం
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ఆధ్వర్యంలోని గనులపై ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. సుమారు 40 మంది మావోయిస్టులు రాత్రి 11 గంటల సమయంలో ఎన్ఎండీసీ గనులపై దాడి చేశారు.
ఈ క్రమంలో అక్కడ భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ బలగాలు మావోయిస్టులను సమర్థవంతంగానే ఎదుర్కొన్నాయి. రాత్రి 11 గంటల నుంచి 2 గంటల దాకా ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. అర్థరాత్రి 2 గంటల వరకు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సీఐఎస్ఎఫ్ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో మావోయిస్టులు ఎన్ఎండీసీకి చెందిన పలు వాహనాలు, షావెల్ మెషిన్లు, డ్రిల్ మెషిన్, పంపు మోటార్లకు నిప్పుపెట్టారు.
ఈ దాడిలో రూ. 50 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భద్రత పెంచినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.