మావోయిస్టులకు బిగ్ షాక్: కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి?
రాయ్ పూర్: టాప్ మావోయిస్టు నాయకుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న అలియాస్ రమణ ఆకస్మికంగా మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో సోమవారం ఆయన మరణించినట్లు తెలుస్తోంది. దీనిపై మావోయిస్టులు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఆయన మరణంపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని జాతీయ మీడియా చెబుతోంది. ఛత్తీస్ గఢ్ పోలీసు అధికార వర్గాలు మాత్రం రమణ మృతి చెందినట్లు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారని, అదే సమయంలో గుండెపోటు రావడంతో మరణించినట్లు సమాచారం.
ఆయుధాల తయారీ.. రవాణా పర్యవేక్షణ
మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ బాధ్యతలకు అదనంగా మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఆయన వ్యహరిస్తున్నారు. ఆయుధాలను తయారు చేయడం, మూడో కంటికి తెలియకుండా వాటిని రవాణా చేయడంలో రమణకు నైపుణ్యం ఉందంటూ ఇదివరకే వార్తలు వచ్చాయి. ఆయుధాల డంపింగ్ బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారట.
సిద్ధిపేట్ జిల్లా నుంచి..
తెలంగాణలోని సిద్ధిపేట్ జిల్లా మద్దూరు మండలం బెక్కల్ గ్రామానికి చెందిన వ్యక్తి రమణ. చాలాకాలం కిందటే ఆయన మావోయిస్టుల్లో చేరారు. 2014లో కీలకమైన కేంద్ర కమిటీలో సభ్యత్వాన్ని పొందరు. ఆయన భార్య సోడెం సావిత్రి కూడా మావోయిస్టులో కొనసాగుతున్నారు. రమణ సోదరుడు పరశురాములు, కుమారుడు శ్రీకాంత్ అలియాస్ రంజిత్ లపైనా మావోయిస్టులు అనే ముద్ర ఉంది. 1994లో తెలంగాణలో నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఎదురు కాల్పల్లో సావిత్రి, పరశురాములు మరణించారు.
వీఆర్ఎల్ బస్సుల్లో రూ.2000 నోట్లు చెల్లవ్: పెద్ద నోట్లు రద్దవుతాయంటూ..!
మూడు రాష్ట్రాలకు విస్తరింపజేయడంలో..
రమణ మరణించినట్లు వస్తోన్న వార్తలు నిజమే అయితే.. మావోయిస్టుల కార్యకలాపాలకు విఘాతమేనని భావిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో విస్తరించిన దట్టమైన దండకారణ్యం అడవులను కేంద్ర బిందువుగా చేసుకుని మావోయిస్టు కార్యకలాపాలను మూడు రాష్ట్రాలకు విస్తరింపజేయడంలో రమణ కీలక పాత్ర పోషించారని అంటున్నారు. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఛత్తీస్ గఢ్ సహా మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఒడిశాలోని మల్కాన్ గిరి ప్రాంతాలకు మావోయిస్టు కార్యకలాపాలను విస్తరింపజేయడంలో సఫలం అయ్యారనే వార్తలు వెలువడుతున్నాయి.