మావోలపై తిరగబడ్డ జనం: ఓ మావోయిస్టు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
సీలేరు: తొలిసారి ఓ గ్రామస్తులు మావోయిస్టులపై తిరగబడ్డారు. గ్రామస్తుల దాడిలో ఓ మావోయిస్టు మృతి చెందడం గమనార్హం. మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రా-ఒడిశా(ఏవోబీ) సరిహద్దు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధిలో ఉన్న జొడంబో పంచాయతీ జంతురాయి గ్రామానికి శనివారం అర్ధరాత్రి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన ఓ యువకుడిని వారు తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
గమనించిన స్థానికులు మావోయిస్టులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు మావోయిస్టులపై రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఓ మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో మావోయిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి.
మూడో మావోయిస్టు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. మృతి చెందిన మావోయిస్టును గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు హాద్మగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మావోయిస్టు నందిపూర్ ఏరియా కమిటీ సభ్యుడు జిపోగా బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి.
గాయపడిన మావోయిస్టును హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామస్తుల దాడి నేపథ్యంలో మావోయిస్టులు మళ్లీ ప్రతిదాడి చేసే అవకాశం ఉండటంతో పోలీసు, బీఎస్ఎఫ్ జవాన్లు ఆ గ్రామంలో భారీ ఎత్తున మోహరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.