టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక... కలకలం రేపుతోన్న లేఖ...
మంచిర్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు మావోయిస్టు పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కమిటీ పేరుతో ఓ లేఖ విడుదలైంది. దివాకర్ రావు,మంచిర్యాల పట్టణ వార్డు సభ్యులు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించింది. భూదందాలు,కబ్జాలు,రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించింది.
2004లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం సందర్బంగా ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన దివాకర్... ఇప్పటికీ వారి సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపించారు. ముంపు గ్రామాల్లో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు, అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయాలు కాజేశారని ఆరోపించారు.
ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని అక్కడి నాయకులతో కోర్టులో కేసులు వేయించి... గెలిచిన తర్వాత బాధితుల నుంచి మళ్లీ కమీషన్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిపేట సర్పంచ్ ఇసుక అక్రమ దందా ఆపకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
కాగా,దివాకర్ రావు ప్రస్తుతం నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1999, 2004 ఎన్నికల్లో లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా... 2014, 2018 ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయన కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారు. అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనూహ్యంగా కాంగ్రెస్లో చేరడంతో దివాకర్ రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.