పట్టాలు తప్పిన గూడ్స్రైలు, బోగీలు చెల్లాచెదురు(ఫోటో)
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు బోగీలు ఇంజన్ నుండి విడిపోయాయి. లతేహర్ - బెండీ రైల్వే స్టేషన్ల మార్గంలో మావోయిస్టులు రైల్వే పట్టాలను ధ్వంసం చేశారు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇది లతేహర్ జిల్లాలో జరిగింది. మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ట్రాక్లను ధ్వంసం చేసినట్లుగా భావిస్తున్నారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన లతేహర్ - బెండీ ప్రాంతం సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ధన్వాడ డివిజన్లో ఉంది. దాదాపు ఒక మీటరు వరకు రైల్వే ట్రాక్ను ధ్వంసం చేశారు. సంఘటన ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు లభించాయి.
లతేహర్ ఎస్పీ మైఖేల్ రాజ్ మాట్లాడుతూ.. గూడ్స్ రైలుకు చెందిన పలు బోగిలు ఇంజన్ నుండి విడిపోయాయని చెప్పారు. ఇది తెలియగానే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారన్నారు. మావోయిస్టులు విడిచి పెట్టిన పోస్టర్లలో ఏముందో తెలియాల్సి ఉందన్నారు.
గూడ్స్ రైలులోని కొన్ని బోగీలు రెండో రైల్వే ట్రాక్ పైన కూడా పడ్డాయని తెలిపారు. దీంతో పలు రైళ్లను నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ దారి ఢిల్లీ, రాంచీ, ఉత్తర భారత దేశానికి వెళ్లే రైళ్లతో బిజీగా ఉంటుంది. సంఘటన స్థలానికి రైల్వే అధికారులు చేరుకొని సమీక్షిస్తున్నారు.