Nirbhaya case: 20న ఉరి, ఆశ చావని దోషులు, ఢిల్లీ గవర్నర్కు క్షమాభిక్ష అభ్యర్థన
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు తమ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు చేసుకుంటూ ఇప్పటికే ఉరిశిక్ష అమలును మూడుసార్లు వాయిదా వేయించారు.
మార్చి 20 ఉరితీత నేపథ్యంలో..
ఇటీవల మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చాలంటూ ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్కు అభ్యర్థన పెట్టుకున్నాడు.
ఉరి తప్పించుకునేందుకు సాకులు..
జైల్ల ఉన్న సమయంలో తనలో వచ్చిన మార్పు, తన వయస్సు, తన కుటుంబ సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని గవర్నర్ను తన తాజా పిటిషన్లో అభ్యర్తించాడు వినయ్ శర్మ. మార్చి 20న ఉరిశిక్ష అమలుకానున్న నేపథ్యంలో నిర్భయ దోషలు ఇలాంటి ప్రయత్నాలు చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మూడుసార్లు వాయిదా పడ్డ మరణశిక్ష
జనవరి 22నే నలుగురు దోషులకు ఉరితీయాల్సి ఉండగా.. న్యాయపరమైన అవకాశాల పేరుతో చివరి నిమిషం దోషులు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడుకుంటూ వచ్చింది. ఓవైపు కోర్టులో పిటిషన్లు, మరోవైపు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థనలతో ఈ నలుగురు దోషులు ఉరితీతను వాయిదా వేయించారు.
Recommended Video
20న ఉరి ఖాయమే..
అయితే, ప్రస్తుతం న్యాయపరమైన అవకాశాలన్నీ ముగియడంతో కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. వినయ్ శర్మ పిటిషన్ను ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో మార్చి 20న దోషులు వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేష్ కుమార్, పవన్ గుప్తాలకు ఉరితీత ఖాయంగా కనిపిస్తోంది. 2012లో నిర్భయపై సామూహికంగా అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడగా, మరో నిందితుడు మైనర్ కావడంతో జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది.