మరోసారి ఆధార్ గడువు పొడిగింపు.. సూచనప్రాయంగా వెల్లడించిన కేంద్రం!?
న్యూఢిల్లీ: మరోసారి ఆధార్ గడువును పొడిగించే ఆలోచనలో ఉన్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం సూచనప్రాయంగా వెల్లడించింది. ఆధార్ కేసుపై సుదీర్ఘ విచారణ కొనసాగుతున్నందున, అనుసంధానానికి గడువు మరికొన్ని రోజులు పెంచనుంది.
Recommended Video
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ మార్చి 31 వరకు కేంద్రం గడువు విధించిన విషయం తెలిసిందే.
ఆధార్ గడువు పొడిగింపుపై...
ఆధార్ అనుసంధానంపై కేసును విచారిస్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి గడుపు పొడిగింపుపై అటార్నీ జనరల్ కే వేణుగోపాల్ మంగళవారం తెలియజేశారు.
కేసు విచారణ పూర్తయ్యే వరకు...
గత డిసెంబరు 15గా ఉన్న ఆధార్ అనుసంధానం గడువును సుప్రీంకోర్టు సూచనలతో కేంద్రం మార్చి 31 వరకు పొడిగించింది. అయితే రాజ్యాంగ సమగ్రతకు సవాల్గా మారిన ఈ కేసు విచారణ పూర్తయినంత వరకు మార్చి 31 గా ఉన్న గడువును మళ్లీ పొడిగించాలని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు.
గడువు పెరుగుతుంది కానీ..
అయితే ఆధార్ అనుసంధానం గడువును గతంలోనే పెంచారని, మళ్లీ మరోసారి పొడిగిస్తారని, కానీ ఈ నెలాఖరుకు దీనిపై ఈ మేరకు ప్రకటన వెలువడినా.. కేసులో పిటిషనర్ల వాదనలు పూర్తిచేయాలని అటార్నీ జనరల్ కోరారు. దీనిపై ధర్మాసనం మాట్లాడుతూ అటార్నీ జనరల్ లేవనెత్తిన అంశం కీలమైందని, ఈ కేసులో పిటిషనర్ల పునరావృత వాదనలకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది.
అంత తక్కువ సమయం ఇస్తే కష్టమే...
వివిధ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో వివిధ శాఖలు, సంస్థలు సర్దుబాటు, సమన్వయం చేసుకోవాల్సి ఉన్నందున గడువు మరింత పొడిగించాలని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు. మరోవైపు ఈ కేసులో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఒకవేళ కోర్టు ఆధార్పై తన తీర్పును మార్చి 20న వెలువరిస్తే ఆ తరువాత అనుసంధానానికి కేవలం పది రోజులు మాత్రమే ఉంటుందని, అంత తక్కువ సమయం చాలకపోవచ్చని అభిప్రాయపడ్డారు. బుధవారం కూడా ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.