40లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటు ముట్టడి... కేంద్రానికి రైతు నేత రాకేష్ టికాయిత్ హెచ్చరిక..
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు నాయకత్వం వహిస్తున్న బీకేయూ నేత రాకేష్ టికాయిత్ సంచలన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే రైతులంతా పార్లమెంటును ముట్టడి చేస్తారని హెచ్చరించారు. ఏ క్షణమైనా సరే ఢిల్లీ మార్చ్కు రైతులంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాదు,ఈసారి 40లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామన్నారు.మంగళవారం(ఫిబ్రవరి 23) రాజస్తాన్లోని సికార్లో కిసాన్ మహాపంచాయత్ సభలో రాకేష్ టికాయిత్ మాట్లాడారు.
'ఈసారి పార్లమెంటు ముట్టడికి పిలుపునిస్తాం. ఢిల్లీ నగరంలోకి రైతుల యాత్ర చేపడుతాం. ఈసారి 4లక్షలు కాదు 40లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తాం.' అని రాకేష్ టికాయిత్ తెలిపారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న పార్కులను దున్ని పంటలు పండిస్తామన్నారు. పార్లమెంటు ముట్టడి తేదీని యునైటెడ్ కిసాన్ మోర్చా ప్రకటిస్తుందన్నారు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీలో రైతులకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని రాకేష్ టికాయిత్ ఆరోపించారు. ఈ దేశ రైతులు త్రివర్ణ పతాకాన్ని ప్రేమిస్తారని... కానీ ఈ దేశ నాయకులకు ఆ ప్రేమ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గనుక వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే... పంటలకు కనీస మద్దతు ధర అమలుచేయకపోతే... బడా కంపెనీల గోదాములను రైతులు కూల్చివేస్తారని హెచ్చరించారు. దీనికి కూడా త్వరలోనే యునైటెడ్ కిసాన్ మోర్చా తేదీని నిర్ణయిస్తుందన్నారు.
కాగా,దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు గత 3 నెలలుగా రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక ఎజెండాతో వారు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ అవేవీ సఫలం కాలేదు. ఆ చట్టాలను ఏడాదిన్నర పాటు తాత్కాలికంగా పక్కనపెట్టేందుకు కూడా కేంద్రం ముందుకొచ్చింది. అయితే రైతులు మాత్రం వాటి రద్దుకే పట్టుబడుతున్నారు. ఆ చట్టాలను రద్దు చేసేదాకా ఢిల్లీ సరిహద్దులను వీడేది లేదని తెగేసి చెప్తున్నారు.