సెంట్రల్ జైల్లోకి వేరు శెనగ కాయల్లో గంజాయి సరఫరా, కర్ణాటకలో ఏం కావాలంటే అది!
బెళగావి/బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళతో పాటు అనేక మందికి వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు, ఖైదీలకు రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపణలు వెలుగు చూడటంతో కలకలం రేపింది.
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అక్రమాలపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాటకలోని మరో సెంట్రల్ జైలులోని అక్రమాలు వెలుగు చూశాయి. గుట్టు చప్పుడు కాకుండా వేరు శెనగ కాయల్లో గంజాయి పెట్టి ఖైదీలకు సరఫరా చేస్తున్న విషయం వెలుగు చూసింది.
కర్ణాటకలోని బెళగావిలో హిండలగా సెంట్రల్ జైలు ఉంది. కర్ణాటకలోని అతి పెద్ద సెంట్రల్ జైళ్లలో హిండలగా జైలు ఒకటి. హిండలగా సెంట్రల్ జైల్లో కరుడుకట్టిన నేరస్తులు శిక్ష అనుభవిస్తున్నారు. శుక్రవారం హిండలగా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని చూడటానికి అతని బంధవులు వెళ్లారు.
వారు బోజనంతో పాటు వేరు శెనగ కాయలు తీసుకెళ్లారు. తరువాత జైలు సిబ్బందికి అనుమానం వచ్చి వేరు శెనగ కాయలు పరిశీలించారు. వేరు శెనగ కాయలు పగలగొట్టిన తరువాత గింజలు తీసి వేసి ఖాళీ చిప్పల్లో గంజాయి నింపి జైళ్లో ఉన్న ఖైదీలకు సరఫరా చేస్తున్నారని వెలుగు చూసింది. గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని హిండలగా జైలు అధికారులు తెలిపారు.