భార్యతో భర్త బలవంతపు శృంగారం: కేంద్రం వాదన సబబేనా?, జైలుకే అంటున్న సుష్మా భర్త
భార్యతో భర్త చేసే బలవంతపు శృంగారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తే.. భారతీయ వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని పేర్కొంది.
న్యూఢిల్లీ: భార్యతో భర్త చేసే బలవంతపు శృంగారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించలేమని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
భార్యతో భర్త చేసే బలవంతపు శృంగారాన్ని ఎందుకు నేరంగా పరిణగించకూడదో అందులో వివరించింది. భార్యతో భర్త చేసే బలవంతపు శృంగారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తే.. భారతీయ వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని పేర్కొంది. దీన్ని అడ్డుపెట్టుకుని భఆర్యలు భర్తలపై కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారని, వేధింపులకు దాన్నో ఆయుధంగా వాడుకుంటారని చెప్పుకొచ్చింది.
ఉదాహరణగా ఐపీసీ సెక్షన్ 498(ఏ):
వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు తీసుకొచ్చిన ఐపీసీ సెక్షన్ 498(ఏ)ను కేంద్రం ఇందుకు ఉదాహరణగా చూపించడం గమనార్హం. భార్యతో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణిస్తే.. ఐపీసీ సెక్షన్ 498(ఏ) లాగే అది కూడా దుర్వినియోగం అవుతుందని కేంద్రం అందులో తెలిపింది.
చట్టం పరిధిలో నిర్వచించలేం?:
వైవాహిక అత్యాచార అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చి, వారి అభిప్రాయాల మేరకే స్పష్టతకు రావాలని హైకోర్టుకు కేంద్రం సూచించింది. వైవాహిక అత్యాచారాన్ని చట్టం పరిధిలో నిర్వచించలేమని, సమాజంలో విస్తృత ఏకాభిప్రాయం అవసరమని స్పష్టం చేసింది.
సుష్మా స్వరాజ్ భర్త సంచలనం:
వైవాహిక అత్యాచారంపై మాజీ గవర్నర్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైవాహికి అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై ఆయన స్పందించారు. అసలు దేశంలో వైవాహిక అత్యాచారం ఎక్కడుంది? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించడం గమనార్హం.
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే భర్తలంతా ఇళ్లలో ఉండరని, జైళ్లలోనే ఎక్కువమంది ఉంటారని స్వరాజ్ కౌశల్ అభిప్రాయపడ్డారు. ఇళ్లు జైళ్లను తలపించకూడదని అన్నారు.
సమంజసమేనా:
భార్య ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా భర్త ఆమెతో బలవంతపు శృంగారం చేయడమనేది ఎంతవరకు సబబు అనేది మహిళల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న. ఒకవిధంగా న్యాయస్థానాలను కూడా పురుషాధిపత్యకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న విమర్శ దీనిపై ఉంది. స్త్రీ స్వేచ్చకు భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ప్రభుత్వం దీనిపై కఠిన సవాళ్లను ఎదుర్కోవడం ఖాయంగానే కనిపిస్తోంది.