డబ్బిస్తే నేనూ చేస్తా: మదర్ థెరీసాపై ఖట్జూ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈసారి ఇటీవలే సెయింట్ హోదా పొందిన మదర్ థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఖట్జూ.
'నాకు కూడా ఎవరైనా ఓ పది మిలియన్ల డాలర్లిస్తే.. నేను కూడా పేదలకు, ఇళ్లులేని నిర్భాగ్యులకు సేవ చేస్తా' అని వ్యాఖ్యానించారు. మదర్ థెరీసాకు రోమనచీ కాథలిక్ చర్చి సెయింట్ హోదా ఇవ్వటంపై ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
అభ్యంతరకర వనరుల నుంచి మదర్ ఆర్థిక విరాళాలు స్వీకరించారని ఆయన అన్నారు. అంతేగాక, 'నా అభిప్రాయంలో ఆమె మిడిమిడి జ్ఞానం ఉన్న మతఛాందసురాలు. మూఢవిశ్వాసురాలు. మోసం చేసే వ్యక్తి' అని ఖట్జు తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్నారు.
మదర్ థెరీసా వందలాది దేశాల నుంచి ప్రశ్నార్థకమైన దాతల నుంచి విరాళాలు సేకరించారని వ్యాఖ్యానించిన ఖట్జూ.. తనకు కూడా డబ్బులిచ్చేవాళ్లుంటే తాను కూడా సేవ చేయగలనని అన్నారు.
కాగా, ఖట్జూ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మదర్ థెరీసా లాంటి సేవకురాలిని విమర్శంచడం సరికాదని అన్నారు. ఖట్జూ లాంటి వ్యక్తులకు మదర్ థెరీసా లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఇలాంటి అభిప్రాయాలే ఉంటాయని ధ్వజమెత్తారు. సిగ్గులేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మరికొందరు ఖట్జూపై విరుచుకుపడ్డారు.