మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ ఆచూకీ లభ్యం: క్వారంటైన్ తర్వాత ప్రశ్నించనున్న పోలీసులు
న్యూఢిల్లీ: నిజాముద్దీన్ మర్కజ్లో తబ్లీఘీ జమాత్ సమావేశం నిర్వహించిన జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ కరోనావైరస్ ప్రబలేందుకు ఓ కారణమైన తబ్లీఘీ జమాత్ చీఫ్ సాద్పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పరారయ్యారు.
ఈ క్రమంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్, షామ్లీ ప్రాంతాల్లో మౌలానా మహమ్మద్ సాద్ కోసం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు మౌలానా మహమ్మద్ సాద్ ఆచూకీని ఢిల్లీ పోలీసులు బుధవారం కనుగొన్నారు. ఢిల్లీలోని జాకీర్ నగర్లోని తన నివాసంలో మౌలానా సాద్ క్వారంటైన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 91 ప్రకారం వివరాలు కోరుతూ ఢిల్లీ నేర విభాగం బుధవారం సాద్కు లేఖ రాసింది. ప్రస్తుతం సాద్ క్వారంటైన్లో ఉన్నారని, 14 రోజుల గడువు పూర్తవ్వగానే విచారణకు హాజరవుతారని సాద్ తరపున న్యాయవాది తౌసిఫ్ ఖాన్ మీడియాకు వెల్లడించారు.
కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని పలువురు ఇస్లామిక్ మతాధికారులు సూచించినా వినకుండా మౌలానా సాద్ ఆ మత సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వేలాది మంది సభ్యుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. కాగా, గతంలో జమాత్ సభ్యులు వైద్యులకు సహకరించాలని కోరుతూ సాద్ ఆడియో సందేశాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ జమాత్ సభ్యుల కారణంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఇప్పటికే జమాత్ సభ్యులను గుర్తించి క్వారంటైన్ కు తరలించారు. పలువురిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.