కరోనా:మర్కజ్లో ‘ఇండోనేషియా’ బాంబు.. వైరస్ ఎలా అంటుకుంది?.. కేంద్ర మంత్రి అనూహ్య కామెంట్లు..
ఇండియాలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మార్చి రెండో వారంలో అక్కడ జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి 960 మంది విదేశీయులతోపాటు మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది హాజరయ్యారు. టూరిస్టు వీసాలపై వచ్చి, మతపరమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం చట్టవిరుద్ధమన్న కేంద్ర హోం శాఖ.. సదరు విదేశీయులందరి వీసాలను రద్దు చేసింది. అయితే మర్కజ్ కు వచ్చిన విదేశీయుల్లో 40 శాతం మంది ఇండోనేషియాకు చెందినవాళ్లే ఉండటం, వాళ్లు ఇండియాలోకి అడుగుపెట్టేనాటికే ఇండోనేషియాలో కరోనా బహుళంగా వ్యాప్తి చెంది ఉండటం గమనార్హం. మరోవైపు, మర్కజ్ ఘటనపై కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన అనూహ్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
40 దేశాల నుంచి వచ్చారు..
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 12-15 మధ్య నిర్వహించిన తబ్లీగీ జమాత్ కు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అందులో 40 శాతం.. అంటే, 379 మంది ఒక్క ఇండోనేషియా నుంచే వచ్చారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత అత్యధికంగా యూకే నుంచి 110 మంది, మలేసియా 75, కిర్గిజిస్తాన్ నుంచి 77 మంది వచ్చారు. మిగతావాళ్లు మడగాస్కర్, ఆస్ట్రేలియా, స్విడన్, ఉక్రేయిన్, బంగ్లాదేశ్ కు చెందినవారుగా వెల్లడైంది. ఇండోనేషియా నుంచి వచ్చినవాళ్లలో ఎక్కువమంది మార్చి మొదటివారంలో సొంత దేశం నుంచి బయలుదేరినట్లు తెలిసింది. అప్పటికే ఆ దేశంలో..
ఇండోనేషియాలో సీన్ ఇది..
చైనాలో కరోనా పుట్టిన కొద్ది రోజులకే.. జనవరిలో ఇండోనేషియాలోని ఈస్ట్ జువా దీవిలో నెదర్లాండ్స్ కు చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అప్పటికి వ్యాధిపై అవగాహన లేక ఆ పేషెంట్ ను మూడు ఆస్పత్రులు తిప్పారు. ఆ తర్వాత కూడా అడపాదడపా కొందరికి లక్షణాలు కనిపించినా, వాళ్లంతా విదేశీయులు కావడంతో సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. మార్చి మొదటి వారంలో ఓ టెలికాం సంస్థ ఉద్యోగి కుటుంబమంతా వైరస్ బారినపడ్డ తర్వాత అధికారిక ప్రకటనలు మొదలయ్యాయి. వైరస్ సోకిన మిగతా దేశాలకు భిన్నంగా ఇండోనేషియాలో మరణాల రేటు ఎక్కువగా ఉండటం, యువకులు, చిన్నపిల్లలు కూడా చనిపోవడం కలవరం రేపింది. శుక్రవారం నాటికి ఆ దేశంలో 1986 కేసులు నమోదుకాగా, 181 మంది చనిపోయారు. కోలుకున్నవారి సంఖ్య 134గా ఉంది. ఇంత జరిగినా ప్రెసిడెంట్ జొకొ విడొడొ.. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించలేదు. హెల్త్ ఎమర్జెన్సీ ఆదేశాలు మాత్రమే, అదికూడా మార్చి 31న జారీచేశారు.
మర్కజ్ తొలి కేసు మార్చి 14న..
ఇండోనేషియా నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన కొందరు.. మర్కజ్ లో ప్రార్థనల తర్వాత మార్చి 14న కరీంనగర్ రావడం, అప్పటికే వైరస్ భయాల నేపథ్యంలో వాళ్లను అదుపులోకి తీసుకుని పరీక్షలు జరపడంతో కొంత మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. దీనిపై కేంద్రానికి ఉప్పందించింది తామేనని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ప్రకటించారు. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలకు కారణమైన మర్కజ్ ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా గుర్తించినప్పటికీ.. వైరస్ ఇండోనేషియన్ల ద్వారానే వచ్చిందా? లేక ఇతరుల ద్వారా వ్యాపించిందా? అనేది కచ్చితంగా వెల్లడికాలేదు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు నిర్వహించారంటూ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పరారైపోయిన మర్కజ్ చీఫ్ మౌలానా సాద్, తాను క్వారంటైన్ లో ఉన్నట్లు ఆడియోలో చెప్పుకున్నారు.
ఇస్లాం ఇమేజ్ డ్యామేజ్..
మర్కజ్ ఉదంతంపై కేంద్ర మంత్రి వీకే సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అనూహ్య కామెంట్లు చేశారు. తబ్లీగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నవాళ్లలో కొంత మంది కరోనా టెస్టులను వ్యతిరేకిస్తుండటం, ఇండోర్ లో ఏకంగా డాక్టర్లపైనే దాడులకు దిగడం లాంటి ఘటనల వల్ల ఇస్లాంకు ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నదని సింగ్ అన్నారు. తన సొంత లోక్ సభ నియోజకవర్గం ఘజియాబాద్ లో కరోనా నివారణ చర్యల్ని ఆయన రివ్యూచేశారు.
ఏం సాధిస్తారు?
‘‘మర్కజ్ లో ప్రార్థనల్లో పాల్గొన్నవాళ్లు కొంత మంది పారిపోతే ఇంకొంతమంది దాక్కున్నారు. అలాంటి పిచ్చి పనులతో వైరస్ ను వ్యాపింపజేసి వాళ్లు సాధించేదేముంది? ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య. ఒక మతానికి చెందినవాళ్లే ఇలా చేస్తున్నారు. ఇండోర్ లో డాక్టర్లను తరిమికొట్టారు. దేశంలోని మౌలానాలు, ముస్లిం పెద్దలు వెంటనే పిలుపు ఇవ్వాలి. తమ మతం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, వైరస్ లక్షణాలున్నవాళ్లంతా వెంటనే ఆస్పత్రులకు రావాలి''అని మంత్రి వీకే సింగ్ అన్నారు.
సింగ్ వ్యాఖ్యలపై దుమారం..
మర్కజ్ ఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, ఒక విపత్తుకు మతం రంగులు పులమడమేంటనే విమర్శలు సర్వత్రా వ్యక్తముతున్నాయి. అంతలోనే కేంద్ర మంత్రిగా ఉన్న వీకే సింగ్.. ముస్లింలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడటం విదాస్పదమైంది. వైరస్ పట్ల అవగాహన పెంచి, బాధితులు ఆస్పత్రులకు వచ్చేలా చేయాలేగానీ, మతాలను ప్రస్తావిస్తూ మాట్లాడొద్దని పలు పార్టీల నేతలు ఆయనకు సూచించారు.
Recommended Video
పెరుగుతోన్న కేసులు..
మర్కజ్ ప్రార్థనల ద్వారా వేల మందికి వైరస్ సోకినట్లు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో శుక్రవారం నాటికి మన దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2892కు పెరిగింది. మొత్తం 75 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధికంగా 423, 404 కేసులు వెలుగుచూశాయి. ఏపీలో ప్రస్తుతం 161 కేసులు, తెలంగాణలో 154 కేసులు ఉన్నాయి.