వార్నీ.. ఇలా కూడా చేసుకుంటారా పెళ్లి? శ్మశానంలో ఒక్కటైన జంట!
మహారాష్ట్రలోని జాల్నా జిల్లా.. పరతూర్లో ఓ వివాహం ఎవరూ ఊహించని విధంగా శ్మశానంలో జరిగింది. పరతూర్లోని వైకుంఠధాం శ్మశానవాటికలో మంజుశ్రీ, ఆకాష్ ఒక్కటయ్యారు.
ముంబై: కొత్తదనం కోసం.. నీటిలో, గాలిలో పెళ్లి చేసుకున్న జంటలను చూశాం కానీ.. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా.. పరతూర్లో ఓ వివాహం ఎవరూ ఊహించని విధంగా శ్మశానంలో జరిగింది.
పరతూర్లోని వైకుంఠధాం శ్మశానవాటికలో మంజుశ్రీ, ఆకాష్ ఒక్కటయ్యారు. ఈ వేడుకుకు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు హాజరుకావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే... పరతూర్లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించే మసన్జోగి (కాటికాపరి) వర్గానికి చెందిన సుభాష్ గైక్వాడ్ కుమార్తె మంజుశ్రీ వివాహం మకుంద్వాడీలోని అదే వర్గానికి చెందిన సాహెబ్రావ్ కుమారుడు ఆకాష్తో కుదిరింది.
అయితే, శ్మశానంలోనే వివాహం చేయాలని మంజుశ్రీ, ఆకాష్ల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బంధుమిత్రులు అందరికీ శుభలేఖలు కూడా వెళ్లాయి. వాటిలో వివాహ స్థలం చూసిన ప్రతిఒక్కరూ అవాక్కయ్యారు.
పొరపాటున వివాహం జరిగే స్థలం పేరు తప్పుగా ముద్రించారేమో అనుకుని ఫోన్లు చేసి ఆరా తీశారు. శుభలేఖలో తప్పుగా ఏమీ ముద్రించలేదని, నిజంగానే పెళ్లి శ్మశానంలో జరగబోతోందని తెలిసి ఆశ్చర్యపోయారు.
మొత్తానికి ముందుగా నిర్ణయించిన ప్రకారమే మంజుశ్రీ, ఆకాష్ల వివాహం కోసం వైకుంఠధామ్ శ్మశానవాటికను ప్రత్యేకంగా అలంకరించారు. అంత్యక్రియలు నిర్వహించకముందు శవాలను ఉంచే స్థలంలోనే పెళ్లిమండపాన్ని ఏర్పాటు చేశారు.
రంగుల రంగుల పుష్పాలతోపాటు రంగవల్లులు వేశారు. ఈ తంతును వింతగా భావించిన పలువురు అక్కడికి చేరుకున్నారు. కొందరు శ్మశానంలో నిజంగా పెళ్లి జరుగుతుందా? అనే సందేహంతో కూడా అక్కడికి వచ్చారు. మొత్తానికి ఆడంబరాలు, కట్నకానుకల పేరుతో భారంగా మారిన పెళ్లి వ్యవహారాన్ని ఇంత సులభంగా పూర్తి చేయటం అందరినీ ఆకట్టుకుంది.