పెళ్లి చేసుకోమంటే హనీమూన్ గురించి మాట్లాడిన తేజస్వీ యాదవ్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్కు పెళ్లి సంబంధాలు క్యూ కడుతున్నాయి. తన తండ్రి జైలుకు వెళ్లిన నాటినుంచి పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు తేజస్వీ యాదవ్. ఈ క్రమంలోనే తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు కొందరు జర్నలిస్టులు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారని వారు ప్రశ్నించారు. 2019 ఎన్నికలు అయ్యేవరకు తన పెళ్లి జరగదని చెప్పేశాడు తేజస్వీ యాదవ్. అంతకుముందే పెళ్లి చేసుకుంటే హనీమూన్లో గడపాల్సిన సమయమంతా ఎన్నికల బిజీతోనే సరిపోతుందంటూ చమత్కరించారు.
తన అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి ఈ ఏడాది మేలో జరిగింది. ఇక అప్పటి నుంచే తేజస్వీ యాదవ్ కోసం సంబంధాలు క్యూ కట్టాయి. ప్రముఖ రాజకీయ కుటుంబాలు, పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నత కుటుంబాలనుంచి తనకు సంబంధాలు వస్తున్నాయని చెప్పారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఒకానొక సమయంలో తన అన్న పెళ్లి వేదికపైనే పురోహితుడు కొందరి అమ్మాయిల ఫోటోలను చూపించారని గుర్తు చేశారు తేజస్వీ యాదవ్. తనకు సంబంధాలు వస్తున్న మాట వాస్తవమేనని అయితే తన పెళ్లి కచ్చితంగా 2019 లోక్ సభ ఎన్నికల తర్వాతే ఉంటుందని తెలిపారు. పెళ్లి తర్వాత హనీమూన్కు కూడా సమయం ఉండాలన్న తేజస్వీ... ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఎన్నికల బిజీలో పడి ఆనందంగా గడపాల్సిన హనీమూన్ను దూరం చేసుకుంటున్నట్లు అవుతుందని తేజస్వీ తెలిపాడు. అయినా ఇప్పుడు ఎన్నికల వ్యవహారంతో చాలా బిజీగా ఉన్నట్లు తెలిపిన తేజస్వీ... ఇక పెళ్లికి సమయం ఎక్కడుందని అన్నారు.
"నేను నా పెళ్లి గురించి మాట్లాడాను. ఇది ఒకవేళ సుశీల్ మోడీ వింటే ఇందుకు విరుద్ధంగా మాట్లాడతారు. కావాలంటే చూడండి. తేజస్వీ యాదవ్ ముందు జైలుకు వెళ్లాలి ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని కచ్చితంగా అంటారు..వేచి చూడండి" అంటూ బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీపై కౌంటర్ ఇచ్చారు తేజస్వీ యాదవ్. తేజస్వీ జైలుకు వెళ్లాల్సిందేనంటూ ప్రతిరోజు భగవంతుడిని కోరుకుంటూ ఉంటారని తేజస్వీ ఎద్దేవా చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఒక హోటల్కు భారీ కాంట్రాక్ట్ అప్పజెప్పిన నేపథ్యంలో ఆ యజమాని పాట్నాలో తేజస్వీ యాదవ్, రబ్రీదేవీల పేర్లపై భూమి ఇచ్చిందని సీబీఐ ఆరోపణలు నమోదు చేసింది.