ఆపలేమని లిక్కర్ బంద్: స్త్రీలు నగలు పెట్టుకోవద్దంటారా?
హైవేల్లో మద్యం దుకాణాల మూసివేతపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. చైన్ స్నాచింగ్లను ఆపలేమని స్త్రీలు నగలు ధరించొద్దంటారా అని అడుగుతున్నారు.
మొహలి: జాతీయ రహదారులకు 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలను ఎత్తివేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పంజాబ్ ఆబ్కారీ శాఖ మరో అడుగు ముందుకేసింది. వివాహ వేడుకలు, ఇతర కుటుంబ ఉత్సవాల సందర్భంగా నేషనల్ హైవేస్ నిర్దిష్ట దూరంలోగా ఉన్న పంక్షన్ హాళ్లలో అతిథులకు మద్యం సర్వ్ చేయరాదని ఆంక్షలు విధించింది.
ఎస్ఎఎస్ నగర్ జిల్లా పరిధిలోని 100 పంక్షన్ హాళ్లలో అత్యధికం జాతీయ రహదారుల వెంబడే కొలువు దీరి ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు తన తీర్పులో వివాహ పంక్షన్ హాళ్లలో మద్యం సర్వ్ చేయరాదని ఆంక్షలు విధించకపోవడం గమనార్హం.
ఈ సందర్భంగా పంజాబ్ అదనపు ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్ గుర్తేజ్ సింగ్ మాట్లాడుతూ 'సుప్రీంకోర్టు తీర్పు వివాహ పంక్షన్ హాళ్లకు వర్తిస్తుందా? లేదా? అన్న విషయమై న్యాయస్థానం నుంచి స్పష్టత తీసుకుంటాం. మేం మద్యం సేవనాన్ని మాత్రమే అనుమతించడం లేదు. కానీ దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు స్పష్టత పొందుతాం' అని చెప్పారు.
ఉద్యోగావకాశాలపై ప్రభావం
జిల్లా కేంద్రమైన మొహలి నగర హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, వివాహ పంక్షన్ హాళ్లలో మద్యం విక్రయాలు, సేవనంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. మద్యంతోపాటు ఆతిథ్య రంగంపైనా సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం గణనీయంగా ఉండటంతో భారీగా ఉద్యోగాలు నష్టపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొద్ది నెలల్లో జరిగే వివాహాల కోసం పంక్షన్ హాళ్ల బుకింగ్ ఆర్డర్లు ఇచ్చిన వారు తమ ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారని కొందరు పంక్షన్ హాళ్ల యజమానులు చెప్తున్నారు.
ప్రశ్నిస్తున్నారన్న రిసార్టు యజమానులు
జిరాక్పూర్లోని ఎకెఎం రిసార్ట్స్ యజమాని రాజీవ్ ఛాబ్రా మాట్లాడుతూ కొన్ని రిసార్టులు ఇన్నర్ రోడ్ల లోపలే పరివేష్టితమై ఉన్నాయన్నారు. మెజారిటీ రిసార్టులు హైవేల పరిధిలోకి వస్తున్నాయని, తన క్లయింట్ల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. వివాహ వేడుకల్లో బంధుమిత్రులకు మద్యం సర్వ్ చేయొచ్చా? లేదా? అని పలువురు క్లయింట్లు తనను ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
పంక్షన్ హాళ్లు మార్చుకునేందుకు
ఖరార్ ప్రాంత వాసి సునీల్ మాగో ఈ నెల 18వ తేదీన వివాహ వేడుక కోసం పంక్షన్ హాల్ బుక్ చేసుకోవడంతోపాటు అడ్వాన్స్ కూడా చెల్లించారు. కానీ సుప్రీంతీర్పు నేపథ్యంలో పంక్షన్ హాలు మార్చుకోవాలని భావిస్తున్నారు. ఎస్ఎఎస్ నగర్లోని ఫేజ్ 7 ప్రాంత వాసి అవతార్ సింగ్ ఆదివారం జరిగే ఆయన కుమారుడి వివాహ వేడుకలో మద్యం సరఫరా చేయొచ్చా? లేదా? అని తన పంక్షన్ హాలులోని మేనేజర్లు, ఎక్సైజ్ ఆఫీసర్ల సలహాలు తీసుకుంటున్నాడు. ఎస్ఎఎస్ నగర్ వాసి దర్శన్ సింగ్ మాట్లాడుతూ బుధవారం జరిగే వివాహం కోసం రెండు నెలల క్రితమే పంక్షన్ హాలు బుక్ చేసుకున్నారు. మద్యం కోసం లైసెన్స్ ఫీజు కూడా చెల్లించారు. కానీ తాజా కోర్టు నిర్ణయంతో మద్యం కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థితిగతులు మారిపోతాయంటున్న పంక్షన్ హాళ్ల రిసార్టుల సంఘం
పంజాబ్ వివాహ పంక్షన్ హాళ్లు, రిసార్ట్ యజమానుల సంఘం అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వల్ల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రభుత్వ ఖజానా పైనా దెబ్బపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పలువురి జీవన స్థితిగతులు మారిపోతాయని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు పూర్తిగా విచక్షణపూరితమైన నిర్ణయమని అభివర్ణించారు. సనేటాలోని తులిప్ గార్డెన్ యజమాని రమన్ ఖన్నా మాట్లాడుతూ ‘మేం మద్యం సేకరించం, విక్రయించం. వివాహ పంక్షన్ హాళ్లకు సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుందని మేం భావించడం లేదు. మేం కేవలం వివాహ వేడుకలు మాత్రమే నిర్వహిస్తున్నాం' అని చెప్పారు.
డ్రంకెన్ డ్రైవ్ నిరోధించాల్సిన బాధ్యత
లాండ్రాన్లోని సిడ్నీ హైట్స్ యజమాని రవ్దీప్ సింగ్ సంధూ మాట్లాడుతూ వివాహ పంక్షన్ హాళ్లు, రిసార్టల్లో మద్యం సర్వ్ చేయడంపై నిషేధం విధించడానికి బదులు వాస్తవంగా ప్రభుత్వం డ్రంకెన్ డ్రైవింగ్ ను కట్టడి చేయాలి' అని సూచించారు. లాండ్రాన్లోని డ్రీంలాండ్ రిసార్ట్స్ యజమాని జస్వీందర్ సింగ్ మాట్లాడుతూ తాము ఈ బిజినెస్ ప్రారంభించడానికి తమ ఆస్తులన్నీ అమ్ముకున్నామని, ఇప్పుడు తామేం చేయాలని ప్రశ్నించారు.
5000 ఉద్యోగాలు హాంఫట్!
సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ నగర పరిధిలో 5000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు నెలవారీగా రూ.150 కోట్ల మేరకు నష్టపోవాల్సి వస్తుందని చండీగఢ్ హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక కేంద్ర పాలిత ప్రాంతం ఎక్సైజ్ విభాగం ఏడాది పొడవునా రూ.10 - 13 కోట్ల లైసెన్స్ ఫీజు కోల్పోనున్నది. డ్రంకెన్ డ్రైవింగ్ను నిరోధించేందుకు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుతో చండీగఢ్ నగరంలోని రాష్ట్ర రహదారి గల మధ్య మార్గ్లోని పలు హోటళ్లపై ఎక్కువగా ప్రభావం పడనున్నది. సెక్టార్ 35, వెస్ట్రన్ కోర్టు, సెక్టార్ 43, అల్టియస్, ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ - 2 తదితర ప్రాంతాల్లోని పష్తూన్ రెస్టారెంట్ల యజమానులు మాట్లాడుతూ తమ సిబ్బందిని సగానికి తగ్గించుకోనున్నామని తెలిపారు.
తగ్గనున్న మద్యం విక్రయాలు
చండీగఢ్ నగర పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, పబ్లు, రెస్టారెంట్లలో నెలకు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. సుప్రీం తీర్పు దరిమిలా బిజినెస్ సగానికి పడిపోనున్నది. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చండీగఢ్ హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరవిందర్ పాల్ సింగ్ తెలిపారు. చండీగఢ్ నగరంలోని మెట్రో - 35, మెట్రో - 43 షాపులకు అరవిందర్ పాల్ సింగ్ యజమానిగా ఉన్నారు.
నష్టం అంచనా వేయడం కష్టమేనట!
హైవేల పరిధిలో మద్యం దుకాణాలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు దరిమిలా ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లుతుందన్న సంగతి చెప్పడం కష్ట సాధ్యమని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నేషనల్ హైవేల నుంచి ఇతర ప్రాంతాలకు ఎన్ని షాపులు మళ్లించగలమన్నదానిపైనే ఖనాజాకు వాటిల్లే నష్టం ఎంతన్న సంగతి నిర్ధారించగలమని చండీగఢ్ అసిస్టెంట్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ ఆఫీసర్ రవీందర్ కౌశిక్ తెలిపారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వాసులకు
సెక్టార్ - 43లో గల వెస్ట్రన్ కోర్టు యజమాని సందీప్ అరోరా మాట్లాడుతూ సుప్రీం తీర్పు వల్ల తమ విక్రయాలు నెల వారీగా రూ.20 - 25 లక్షల వరకు పడిపోతాయని అంచనా వేశారు. తమ రాష్ట్రానికి పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి పలువురు ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. వారు ఒకవేళ ఉద్యోగం కోల్పోతే వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయని సందీప్ అరోరా ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలు ఆభరణాలు ధరించొద్దంటారా?
ఆల్టియస్ హోటల్ యజమాని ఎంపీఎస్ చావ్లా మాట్లాడుతూ ‘వారు డ్రంకెన్ డ్రైవింగ్ నిలువరించలేరు. కానీ ఇప్పుడు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ఒకవేళ చైన్ స్నాచింగ్లు నిలువరించకపోతే మహిళలను ఆభరణాలు ధరించొద్దని ఆదేశిస్తారా?' అని ప్రశ్నించారు.