ఇంట్లో ఎవరూ లేని సమయంలో..: ప్రియురాలిపై ఓ ప్రియుడి ఘాతుకం
కాచిగూడ: తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్దపడటంతో.. ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హర్షియాబేగం అనే మహిళ నెలన్నర కిత్రం కుటుంబంతో కలిసి గోల్నాక గంగానగర్లోని రజాక్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగారు. ఆమెకు కుమార్తె (17), ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త మరణించడంతో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
పదో తరగతి దాకా చదువుకున్న కుమార్తె ఇంటి వద్దే ఉంటూ తమ్ముళ్లను చూసుకుంటోంది. పదో తరగతి చదువుతున్న సమయంలో ఖాద్రీబాగ్కు చెందిన సోహెల్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. అయితే తల్లి సూచన మేరకు ఆమె అతన్ని దూరం పెట్టింది. ఇటీవలే ఓ యువకుడితో ఆమెకు నిశ్చితార్థం కూడా జరిగింది.
ఈ విషయం తెలిసిన సోహెల్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం హర్షియాబేగం పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో.. సోహెల్ ఇంట్లోకి వచ్చాడు. కొత్త సెల్ ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ మాజీ ప్రియురాలితో గొడవ పడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
ఆగ్రహంతో సోహెల్ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. 72శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆమె ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.