పెళ్లిలో డీజే ఆపేశారని వరుడి తండ్రి హత్య
డెహ్రాడూన్: పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. బాలీవుడ్ పాటలు పెట్టలేదనే కారణంగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు వరుడి తండ్రిని కాల్చ చంపారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మంగ్లూరు సమీపంలోని సాకోటీ గ్రామంలో విశ్వాస్ రామ్ అనే వ్యక్తి ఇంట్లో తన కుమారుడి వివాహం జరుగుతోంది. పెళ్లి మంత్రాలు మొదలు పెడుతుండగా డీజే ఆపాలని విశ్వాస్ రామ్ అన్నాడు. తాగిన మత్తులో పెళ్లికి వచ్చిన ముగ్గురు యువకులు తాము డీజే ఆపేది లేదంటూ మరింత సౌండ్ పెట్టారు.
దీంతో విశ్వాస్ రామ్కు, ముగ్గురు యువకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో ఓ యువకుడు తన దగ్గర ఉన్న తుపాకీతో డీజే ఆపొద్దని బెదిరించాడు. డీజే ఆపేయడంతో తీవ్ర ఆగ్రాహానికి గురైన ఆ యువకుడు తుపాకీతో విశ్వాస్ను కాల్చేశాడు.
కుటుంబసభ్యులు విశ్వాస్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు నిందిత యువకులను పట్టుకుని చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.