ఐశ్వర్యతో కలిసి జీవించలేను, పెళ్లి వద్దని ఇంట్లో చెబితే వినలేదు: విడాకులపై తేజ్ ప్రతాప్
పాట్నా: ఐశ్వర్య రాయ్తో పెళ్లైన ఆరు నెలల్లోనే ఆర్జేడీ చీఫ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పాట్నా హైకోర్టులో విడాకుల కోసం శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఇది సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆయన చేసిన ప్రకటన మరింత కలకలం రేపుతోంది. ఆయన శనివారం పెళ్లి పైన, తన కుటుంబ సభ్యుల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ ఇద్దరి ఇష్టాయిష్టాలు, వ్యవహారాలు పూర్తిగా భిన్నమని తేజ్ ప్రతాప్ చెప్పారు. ఆమె దక్షిణ ధృవం అయితే తాను ఉత్తర ధృవంలా ఉంటామని చెప్పారు. పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు తనను బలవంతం చేశారని తీవ్రస్థాయిలో మదనపడ్డారు. ఆయన శుక్రవారం విడాకుల కోసం దరఖాస్తు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు.
ఇంట్లో నా మాట ఎవరూ వినలేదు
రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని మా పెళ్లి చేశారని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. తనను బలి పశువును చేశారని వాపోయారు. ఇంట్లో తన గోలను ఒక్కరూ వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్యకు, తనకు మధ్య కుదరదని తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కూడా చెప్పానని, ఆయన వినిపించుకోలేదని అన్నారు.
ఐశ్వర్యకు నాకు కుదరదని చెప్పా
తాను సాధారణంగా ఉండే వ్యక్తినని, ఐశ్వర్య మోడర్న్గా ఉంటుందని, తమ ఇద్దరికి పొసగదని ముందే చెప్పానని తేజ్ ప్రతాప్ యాదవ్ చెప్పారు. విడాకుల విషయమై తాను తన కుటుంబ సభ్యులతోను చర్చించానని చెప్పారు. తాను ఏం చేయాలనుకున్నానో దానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు.
ఆమెతో కలిసి జీవించలేను
ఇష్టం లేని పెళ్లి చేసుకొని నేను కుమిలిపోతూ జీవిస్తున్నానని, ఇలా ఎంతకాలం ఉండాలని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. ఇక ఆమెతో నేను కలిసి జీవించలేనని కుండబద్దలు కొట్టారు. నేను విడాకుల కోసం దరఖాస్తు చేశానని, ఇది వాస్తవమని, ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో కలిసి జీవించలేనని, నా తల్లిదండ్రుల ముందే నాకు, నా భార్యకు మధ్య గొడవలు జరిగాయని చెప్పారు. వారిద్దరు కలిసి ఉండలేరని తేజ్ ప్రతాప్ లాయర్ కూడా చెప్పారు.
ఆరు నెలల క్రితం పెళ్లి
ఢిల్లీలో లేడీ శ్రీరాం కాలేజీ నుంచి ఐశ్వర్య పీజీ చేశారు. లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తొమ్మిదో తరగతితో చదువు ఆపేశారు. కొద్ది కాలం క్రితం ఆయన బీహార్ మంత్రిగా పని చేశారు. ఆర్జేడీ సీనియర్ నేత చంద్రికా రాయ్ కూతురు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఈ ఐశ్వర్య. తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల పెళ్లి ఈ ఏడాది మేలో జరిగింది.