పెళ్లైన కూతురికి కూడా ఉద్యోగం ఇవ్వొచ్చు -కారుణ్య నియామకాలపై కోర్టు సంచలనం
కారుణ్య నియామకాలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో కొడుకును ఏ విధంగానైతే భాగస్వామిగా చూస్తారో పెళ్లైన కూతురిని కూడా అదే విధంగా చూడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లైన కూతురు.. కారుణ్య నియామకానికి అర్హురాలు కాదంటూ దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది..
ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెళ్లైన కూతురిని కుటుంబంలో సభ్యురాలిగా భావించరాదంటూ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఆర్డర్ను సవాల్ చేస్తూ మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ జేజే మునిర్ ధర్మాసనం.. పై విధంగా వ్యాఖ్యానించింది.
''ఇంట్లో కొడుకుకు పెళ్లైనప్పటికీ కుటుంబ సభ్యుడిగానే చూస్తారు. అతడు అన్నింటికీ అర్హుడే. మరి కూతురు విషయంలో ఎందుకు వేరుగా చూడాలనుకుంటున్నారు? పెళ్లైన కూతురు ఏదేని అభ్యర్థిత్వానికి అనర్హురాలుగా గుర్తించడం వివక్ష కిందకే వస్తుంది'' అని కోర్టు అభిప్రాయపడింది.
శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదం
విమ్ల శ్రీవాస్తవ కేసులో కూడా కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. కారుణ్య నియామకాల్లో కొడుకుకు ఉన్న అర్హతలే పెళ్లైన కూతురికి కూడా ఉంటాయని పేర్కొంది. పెళ్లైన కూతురు కారుణ్య నియామకాలకు అనర్హురాలనడం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి ఆస్తిలో కూతురి హక్కులపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పులివ్వగా, ఇప్పుడు హైకోర్టు కారుణ్య నియామకాలపై కీలక ఆదేశాలివ్వడం గమనార్హం.