వాలెంటైన్స్ డే: ప్రియురాలి కోసం వెళితే చంపేశారు
గుర్గావ్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓయువకుడు తన ప్రేయసిని కలవడానికి వెళ్లి ఆమె బంధువుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఈశ్వర్(27) అనే యువకుడు ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని కలిసేందుకు ఆదివారం గుర్గావ్ వెళ్లాడు. కాగా, ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడికి దిగి భవనం నుంచి కిందకు తోసేశారు.
రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడివున్న అతన్ని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈశ్వర్ అర్ధరాత్రి మృతిచెందాడు. ఈశ్వర్ తనకు 7 నెలలుగా పరిచయమని, ఈ వాలెంటైన్స్ డేకి కలుసుకుందామనడంతో తను గుర్గావ్ వచ్చాడని యువతి పోలీసులకు వివరించింది.
ఇద్దరం ఇంట్లో ఉన్న సమయంలో తన బావ, డ్రైవర్ కలిసి ఈశ్వర్పై దాడికి దిగి అతన్ని మేడపై నుంచి తోసేశారని, అప్పటికీ చనిపోకపోవడంతో కారులో తీసుకెళ్లి దూరంగా పడేసి యాక్సిడెంట్ అయినట్లు చిత్రీకరించారని యువతి తెలిపింది.
ఈ మేరకు నిందితులు రమేశ్, అనిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మృతుడికి అప్పటికే వివాహమైనప్పటికీ.. రహస్యంగా ఈ యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు తెలిపారు.