ఢిల్లీ అల్లర్లు మిగిల్చిన విషాదం : భార్యతో ఒక్కరోజైనా గడపలేదు.. నవ వరుడి హతం..
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు ఆయా కుటుంబాల్లో మిగిల్చిన విషాదం గురించి అనేక కథనాలు వెలుగుచూస్తున్నాయి. అందులో ఇదీ ఒకటి. పెళ్లయి రెండు వారాలు కూడా తిరగకముందే ఓ యువకుడు అల్లరి మూకల చేతిలో బలైపోయాడు. పెళ్లి సందడి నుంచి ఇంకా ఆ కుటుంబం బయటకు రానేలేదు.. వధూవరులు ఇద్దరు కలిసి కనీసం ఒక్కరోజైనా గడపలేదు.. అప్పుడే నవ వరుడు హత్యకు గురవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రేమికుల దినోత్సవం రోజు వివాహం
ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్ పరిధిలో ఉన్న గోకుల్పురికి చెందిన అష్ఫక్కి తస్లీమా ఫాతిమా అనే యువతితో ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. ఈ నెల 24వ తేదీ ఆదివారం అష్ఫక్ తిరిగి ఢిల్లీ చేరుకున్నాడు. అప్పటికీ అతని కుటుంబ సభ్యులు,అతని భార్య ఇంకా బులంద్షహర్లోనే ఉన్నారు.అష్ఫక్ ఢిల్లీకి చేరుకున్న రోజు రాత్రే.. గోకుల్పురి సమీపంలోని మౌజ్పూర్,జాఫ్రాబాద్లో అల్లర్లు మొదలయ్యాయి.
తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్న కుటుంబం..
ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల సంగతి బులంద్షహర్లో ఉన్న అష్ఫక్ కుటుంబ సభ్యులకు తెలియడంతో.. సోమవారం ఉదయం ఢిల్లీ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అప్పటికీ తెచ్చుకున్న బట్టలన్నీ అయిపోవడంతో.. అదే రోజు రాత్రి ఢిల్లీకి బయలుదేరి.. తెల్లవారుజామున గోకుల్పురికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
అదే చివరిసారి..
మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు తస్లీన్ ఇంట్లో వంట చేసింది. అష్ఫక్,తస్లీన్,కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు.పెళ్లి తర్వాత ఈ జంట కలిసి పంచుకున్న మొదటి భోజనం ఇదే. పెళ్లి హడావుడి కారణంగా అప్పటివరకు వారిద్దరూ కలిసి గడపనే లేదు. వృత్తి రీత్యా ఎలక్ట్రిషియన్ అయిన అష్ఫక్.. ఆరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఓ ఫోన్ కాల్ రావడంతో బయటకెళ్లాడు. తమ ఇంటికి సమీపంలోని ఓ ఇంట్లో విద్యుత్ కనెక్షన్కి సంబంధించి ఏదో సమస్య తలెత్తడంతో.. దాన్ని బాగుచేసేందుకు ఆ ఇంటికెళ్లాడు. అష్ఫక్ను కుటుంబ సభ్యులు చూడటం అదే చివరిసారి.
కుటుంబంలో తీవ్ర విషాదం..
అదేరోజు అష్ఫక్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆరోజు సాయంత్రం నమాజ్ ముగించుకుని ఇంటికి బయలుదేరిన అష్ఫక్ తండ్రికి స్థానికులు.. ఈ విషయాన్ని చెప్పారు. అష్ఫక్ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే.. అతన్ని ముస్తఫాబాద్లోని అల్ హింద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కడినుంచి జీటీబీ ఆసుపత్రికి తరలించి.. పోస్టుమార్టమ్ పూర్తయ్యేంతవరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. పెళ్లయిన 12రోజులకే భర్తను పోగొట్టుకుని తస్లీన్.. కొడుకును పోగొట్టుకుని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. తన భర్త గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోకుండానే అతన్ని కోల్పోయానని తస్లీమా రోదిస్తోంది.