కోర్టు ఆసక్తికర తీర్పు: ప్రియుడు అత్యాచారం చేశాడని వివాహిత కేసు పెట్టడం తగదు
పెళ్లైన మహిళ, మూడో వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేస్తే అది చెల్లదని ఆసక్తికర తీర్పు ఇచ్చింది బాంబే హైకోర్టు.
వివరాల్లోకి వెళితే... జూన్ 2013లో సచిన్ పొటుడే అనే వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసును నమోదు చేశారు వార్దా పోలీసులు. అయితే ఆ మహిళకు అప్పటికే మరొకరితో వివాహమై ఒక బిడ్డ కూడా ఉంది. అయితే సచిన్ తనకు పరిచయమయ్యాక ఆయనతో సన్నిహితంగా మెలిగింది. భర్తకు దూరంగా ఉంటూ సచిన్తో దగ్గరైంది. సచిన్తో సన్నిహితంగా ఉడటం ఆయన భార్య దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక అప్పటి నుంచి సచిన్ తన భార్యతోనే ఉంటున్నాడు. ఇది జీర్ణించుకోలేకపోయిన సదరు మహిళ... సచిన్ తనను పట్టించుకోవడం లేదని తలచి వార్దా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సచిన్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ బాంబే హైకోర్టును 2014లో సచిన్ ఆశ్రయించాడు. విచారణ చేసిన డివిజన్ బెంచ్... పెళ్లైన మహిళ తన భర్తతో తప్ప ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోరాదని వ్యాఖ్యానించింది. మరొక వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని తప్పుబట్టింది. విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకోవడాన్ని తప్పుగా పరిగణించిన కోర్టు... కేసును కొట్టివేసింది.