కార్లపైనే అధిక పన్ను ఎందుకు.. బైకులపై ట్యాక్స్ ఎందుకు విధించరు: మారుతీ సుజుకీ
దేశంలో విద్యుత్తో నడిచే వాహనాల వినియోగంను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రస్తుతం ఇంధనంతో నడిచే కార్లపై అధిక పన్ను విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది . దీన్ని తప్పుబట్టింది ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ. కార్లు మాత్రమే కాలుష్య కారకాలను విడుదల చేయవని ద్విచక్ర వాహనాలు అంటే స్కూటర్లు బైకులు సైతం కాలుష్యాన్ని విడుదల చేస్తాయని... వాటిపై కూడా ఇదే తరహా పన్నులు విధించాలని డిమాండ్ చేసింది. ద్విచక్ర వాహనాలు కూడా పెట్రోల్పై నడుస్తాయని మరి వాటి సంగతేంటని ప్రశ్నించారు మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ఛైర్మెన్ ఆర్సీ భార్గవ. దేశంలో మూడొంతుల్లో రెండితల పెట్రోలును బైకులు వినియోగిస్తున్నాయని చెప్పారు. కేవలం విద్యుత్తో నడిచే బైకులు వినియోగించేందుకు కార్లపై పన్నులు ఎలా విధించడం ఎంతవరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు.
గాలిలో కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో భారత ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది. అంతేకాదు ఇంధనం దిగుమతిపై కూడా ఖర్చును తగ్గించుకోవాలని భావిస్తోంది. దేశంలో 82 శాతానికి పైగా చమురును దిగుమతి అవుతోంది. అదేసమయంలో ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 16వ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై స్పష్టమైన విధానాన్ని తీసుకురావాల్సి ఉంది. అంటే రీచార్జ్ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
విద్యుత్ వాహనాల వినియోగంను ప్రోత్సహించే క్రమంలో నీతి ఆయోగ్ ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. కొత్తగా ఉత్పత్తి అవుతున్న పెట్రోల్ మరియు డీజిల్ కార్లపై రూ.12వేలు అధిక పన్ను విధించి అదే సమయంలో విద్యుత్ వాహనాలకు రూ. 25వేల నుంచి రూ.50వేల వరకు వెసులుబాటే కల్పించే యోచనలో ఉంది. అది కూడా తొలి ఏడాది మాత్రమే ఇలా చేయనుంది. భారత దేశంలో చిన్న కార్లు పెద్ద ఇబ్బందిగా మారాయని భార్గవ అన్నారు.
దాదాపు 70శాతం చిన్నకార్లు ఇళ్లలో పార్కింగ్ చేసుకోలేమని అదే సమయంలో ఛార్జింగ్ కూడా చేయలేమని భార్గవ్ అన్నారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీని డిజైన్ చేయాలని చెప్పారు. రూ. 12వేలు అదనంగా పన్ను విధించడమంటే కారు ధర 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు.ఇప్పటికే ఇన్ష్యూరెన్స్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం సేల్స్ పై పడిందని చెప్పిన భార్గవ మధ్యతరగతి వారు ఈ ధరలను చూసి కారు కొనేందుకు జంకుతారని చెప్పారు. సబ్సీడీలన్నీ ధనికులకే వెళతాయని అలా చేయడం వల్ల మధ్యతరగతి వారు నష్టపోతారని చెప్పారు. తమ కంపెనీ కూడా సీఎన్జీ వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించిందని ఇందులో భాగంగానే హైబ్రిడ్ టెక్నాలజీ వినియోగించి తయారు చేస్తామని చెప్పారు భార్గవ.