కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 40 మందికి గాయాలు...
గుజరాత్లోని దహేజా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది కార్మికులు గాయపడ్డారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం 10 ఫైర్ ట్రక్కులు అక్కడ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రమాదం సంభవించిన ఫ్యాక్టరీ వద్ద పొగ దట్టంగా కమ్ముకుపోయింది. అగ్రో కెమికల్ కంపెనీ అయిన ఆ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు వల్లే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. 40 మందికి కాలిన గాయాలవగా.. వారందరినీ బరుచ్లోని ఆసుపత్రికి తరలించారు. ప్లాంటులో చెలరేగిన మంట ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించింది. దీంతో సమీపంలోని రెండు గ్రామాల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు బరుచ్ కలెక్టర్ ఎండీ మోదియా తెలిపారు. యశస్వి రసాయన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆ కెమికల్ ఫ్యాక్టరీ నడుస్తోంది. పారిశ్రామిక అవసరాల కోసం దాదాపు 15 రకాల కెమికల్స్ను ఇక్కడ తయారుచేస్తారు.
కాగా,గత నెలలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్లో స్టైరిన్ గ్యాస్ లీకై 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో కొంతమంది నిద్రలో ఊపిరాడక మృతి చెందారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తి.. గ్యాస్ ప్రభావంతో మధ్యలోనే కుప్పకూలిపోయారు. దాదాపు 500 పైచిలుకు మంది గ్యాస్ ప్రభావం బారినపడ్డారు. మృతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1కోటి పరిహారం ప్రకటించింది. బాధితుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరిస్తుందని హామీ ఇచ్చింది.