ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: ఏకంగా 15 అగ్నిమాపక శకటాలు శ్రమిస్తున్నా.. !
ముంబై: ముంబైలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విల్లేపార్లెలోని ఓ అపార్ట్ మెంట్ లో సంభవించిన అగ్నిప్రమాదం ఉదంతాన్ని విస్మరించకముందే- మరో దుర్ఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఘట్కోపర్ లోని ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. దీనివల్ల సంభవించిన ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉందనేది ఇంకా తెలియ రాలేదు. సమాచారాన్ని అందుకున్న వెంటనే 15 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేస్తున్నాయి.
వారం రోజుల వ్యవధిలో ముంబైలో చోటు చేసుకున్న రెండో అగ్నిప్రమాద ఘటన ఇది. ఈ నెల 22వ తేదీన విల్లేపార్లెలోని ఓ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. సరిగ్గా అయిదు రోజుల వ్యవధిలోనే ఘట్కోపర్ లోని ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్కోపర్ సమీపంలోని సాకినాకా ఖైరాని రోడ్ లో ఉన్న సుభాష్ నగర్ లో ఉందీ ఫ్యాక్టరీ. చాలాకాలంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఈ సాయంత్రం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్న వెంటనే అగ్ని కీలలు విస్తరించాయి. ఈ ప్రమాదానికి గల కారణాలను ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ప్రాణనష్టం సంభవించినట్లు ఎలాంటి సమాచారం లేదు.
దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సమాచాారాన్ని అందుకున్న వెంటనే 15 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేస్తున్నాయి. అయినప్పటికీ.. అంత సులువుగా అవి అదుపులోకి రావట్లేదు. స్థానిక పోలీసులు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంఘటనా స్థలానికిచేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.