ప్యాకేజింగ్ మిల్లో పెను అగ్నిప్రమాదం: మంటల్లో అయిదంస్తుల భవనం: 125 మందికి పైగా కార్మికులు
అహ్మదాబాద్: గుజరాత్లోని ఓ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయిదంతస్తుల భవనంలో కొనసాగుతోన్న ఓ ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. ప్యాకేజింగ్ కోసం వినియోగించే వస్తువులు పెద్ద ఎత్తున నిల్వ ఉండటం వల్ల మంటలు అతివేగంగా వ్యాపించాయి. భవనం మొత్తాన్నీ చుట్టుముట్టాయి. దట్టమైన పొగ, మంటలు క్షణాల్లో విస్తరించాయి. ఈ ఘటనతో కార్మికులు భయాందోళనలకు గురయ్యారు.
ప్రాణాలను కాపాడుకోవడానికి..
తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అయిదంతస్తుల భవనం మీది నుంచి కిందికి దూకారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బలగాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ ఘటన వల్ల పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు చెబుతున్నారు. ప్రాణనష్టం చోటు చేసుకున్నట్లుగా ఇప్పటిదాకా వార్తలు అందలేదు. కార్మికులందరినీ సురక్షితంగా వెలుపలికి తీసుకుని రాగలిగామని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.
ప్యాకేజింగ్ మిల్లో
గుజరాత్లో డైమండ్ సిటీగా పేరున్న సూరత్ సమీపంలోని కడోదరలో గల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెందిన పారిశ్రామికవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలాకాలం నుంచి ఇక్కడ కొనసాగుతోన్న వైవా ప్యాకేజింగ్ మిల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ మిల్లుకు సంబంధించిన అయిదంతస్తుల భవనంలో ప్యాకేజింగ్ సంబంధించిన వస్తువులను నిల్వ ఉంచారు. అందులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
శరవేగంగా మంటలు..
మంటలు వ్యాప్తి చెందడానికి దోహదపడే వస్తువులు, పదార్థలు నిల్వ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్లు అంచనాలు ఉన్నాయి. అగ్నికీలలు శరవేగంగా విస్తరించడానికి అవి కారణమైనట్లు భావిస్తున్నారు. ఘాటు వాసనతో కూడిన దట్టమైన పొగ వెలువడింది. ఆ వెంటనే భగ్గుమంటు మంటలు చెలరేగాయి. దీనితో ఉలిక్కపడిన కార్మికులు భవనం పైకప్పునకు చేరుకున్నారు. మంటలు విస్తరించడంతో భయపడిన కొందరు కార్మికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ అయిదంతస్తుల భవనం మీది నుంచి కిందికి దూకారు.
ఇద్దరు కార్మికులు మృతి..
ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో బయటికి వెళ్లడానికి వీల్లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు వారంతా. సఃంఘటన చోటు చేసుకున్న సమయంలో 125 మందికి పైగా కార్మికులు మిల్లో విధి నిర్వహణలో ఉన్నారు. మంటలు చెలరేగిన తరువాత చోటు చేసుకున్న తొక్కిసలాట, ఊపిరి ఆడకపోవడం వంటి కారణాలతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
Recommended Video
10కి పైగా అగ్నిమాపక శకటాలతో..
మరికొందరు అక్కడ నిల్చుండిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నం అయ్యాయి. 10కి పైగా అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంపై చిక్కుకుపోయిన వారిని ల్యాడర్ల ద్వారా రక్షించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఘాటు వాసనతో కూడిన పొగను పీల్చడం వల్ల కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది.