నిన్న బెంగళూరు..: నేడు చెన్నై పార్కింగ్లో భారీ ప్రమాదం, 175కు పైగా కార్లు దగ్ధం
చెన్నై: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎయిర్ షోలో ఘోర అగ్ని ప్రమాదంలో వందలాది కార్లు దగ్ధమైన ఘటన మరవకముందే చెన్నైలోను ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చెన్నై నగర శివారులోని పోరూర్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో సుమారు 175కు పైగా కార్లు దగ్ధమయ్యాయి. అక్కడ ఉన్న ఓ ప్రయివేటు పార్కింగ్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపు చేశాయి.
పోరూరులోని రామచంద్ర ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ ట్యాక్సీ కంపెనీకి చెందిన కార్లను పార్కింగ్ చేసే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న కెమికల్ వ్యర్థాల డంపింగ్ యార్డులో మంటలు అంటుకుని ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఈ మంటలు కార్ల పార్కింగ్ ప్రాంతం వరకు వ్యాపించాయి. డంపింగ్ యార్డ్లో చెరుకు పిప్పి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.