టెన్షన్.. టెన్షన్.. మణిపూర్-నాగాలాండ్ సరిహద్దులో భారీ కార్చిచ్చు.. 4 రోజులుగా తగలబడుతున్న అడవి...
ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్-నాగాలాండ్ సరిహద్దులోని జుకౌ వ్యాలీలో భారీగా కార్చిచ్చు చెలరేగింది. గత మంగళవారం(డిసెంబర్ 29) చెలరేగిన ఈ కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. గురువారం(డిసెంబర్ 31) నాటికి నాగాలాండ్లోని జుకౌ వ్యాలీ నుంచి మణిపూర్లోని సేనాపతి జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతానికి కార్చిచ్చు వ్యాపించింది. ఈ కార్చిచ్చు ఇలాగే కొనసాగితే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన మణిపూర్ ప్రభుత్వం కేంద్ర సాయం కోరింది.
Recommended Video
కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్కు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కార్చిచ్చును చల్లార్చేందుకు అవసరమైన సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపించాల్సిందిగా ఈ సందర్భంగా కేంద్రమంత్రిని సీఎం కోరారు. అలాగే ఆర్మీ,అసోం రైఫిల్స్ బలగాలను కూడా పంపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తరుపున అన్ని విధాలా సాయం అందిస్తామని అమిత్ షా సీఎంకు భరోసానిచ్చారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు...
ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది,అటవీ అధికారులు,కొంతమంది వాలంటీర్లు హెలికాప్టర్ల ద్వారా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ మంటలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్,సీఎస్ డా.రాజేష్ కుమార్,డీజీపీ ఎల్ఎం కౌతేతో కలిసి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నాగాలాండ్ ఓఎస్డీ జానీ రౌంగ్మెయ్ మాట్లాడుతూ... కార్చిచ్చును పరిశీలించేందుకు గురువారం ఐఏఎఫ్ విమానాలతో ఏరియల్ సర్వే నిర్వహించినట్లు చెప్పారు. అటవీ అధికారులు,అగ్నిమాపక సిబ్బంది,ఎమర్జెన్సీ సర్వీస్,ఎస్డీఆర్ఎఫ్,వాలంటీర్లు తదితరులు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు చెప్పారు.
అలాంటి వ్యవస్థ ఉండాలన్న గవర్నర్...
అవసరమైతే ఐఏఎఫ్ విమానాలను కూడా సహాయక చర్యలకు ఉపయోగిస్తామని నాగాలాండ్ ఓఎస్డీ జానీ తెలిపారు. నాగాలాండ్ గవర్నర్ ఆర్ రవి కూడా పరిస్థితిని సమీక్షించారు. ఇటువంటి అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు సరైన ప్రోటోకాల్ లేకపోవడ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందన్నారు. ఇప్పటికైనా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించాలని... మున్ముందు ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు శాటిలైట్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని గవర్నర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.