ప్రపంచంలోనే పవర్ ఫుల్ వ్యక్తి.. కొండముచ్చులతో కాపలా.. ట్రంప్ సెక్యూరిటీ విశేషాలు
సెక్యూరిటీ లెక్కల ప్రకారం.. అమెరికా అధ్యక్షుణ్ని ప్రపంచంలోకెల్లా పవర్ ఫుల్ వ్యక్తిగా అభివర్ణించొచ్చు. ఆయన వేసుకునే సాక్సుల దగ్గర్నుంచి ప్రయాణించే విమానం దాకా వేటికవే ప్రత్యేకమైనవని తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ వస్తున్నారంటే సీక్సెట్ సర్వీసులు మొదలు సాధారణ పోలీసుల దాకా అలర్ట్ గా ఉంటారు. అయినాసరే ఆయన భద్రత కోసం కొండముచ్చుల అవసరం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకోనున్నారు. సిటీలో ఆయన పర్యటించనున్న ప్రదేశాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరింపజేశారు. అమెరికా సీక్రెట్ సర్వీసు, ప్రెసిడెంట్ పర్సనల్ సెక్యూరిటీ విభాగాల సంగతి అటుంచితే.. గుజరాత్ ప్రభుత్వం సైతం కనీవినీ ఎరుగని స్థాయిలో సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది.
సుమారు 10వేల మంది పోలీసులు, 40 కంపెనీల కేంద్ర బలగాలతోపాటు వందల సంఖ్యలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్ జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) బృందాలు కూడా ట్రంప్ భద్రతతో కోసం రంగంలోకిదిగాయి. సెక్యూరిటీని మానిటర్ చేసేందుకే 25 మంది ఐపీఎస్ అధికారుల్ని కేటాయించారు. అత్యాధునిక డ్రోన్ల ద్వారానూ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే..
అహ్మదాబాద్ లో 'నమస్తే ట్రంప్' కార్యక్రమం తర్వాత సోమవారం సాయంత్రమే ట్రంప్, ఆయన భార్య మెలానియా ఆగ్రా వెళ్లి.. ప్రఖ్యాత తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. సాధారణంగా తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంటుంది. కోతుల వల్ల పర్యాటకులు ఇబ్బందిపడే దృశ్యాలు ప్రతిరోజూ కనిపిస్తాయక్కడ. ట్రంప్ పర్యటన సందర్భంగా అలాంటి అపశృతులేవీ చోటుచేసుకోకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే ట్రంప్ సెక్యూరిటీ టీమ్ లోకి ఐదు కొండముచ్చుల్ని తీసుకున్నారు.
మూడ్రోజుల ముందు నుంచే తాజ్ పరిసర ప్రాంతాల్లో కోతుల గెంటివేత ముమ్మరంగా సాగుతోంది. కొండముచ్చుల సాయంతో కోతుల్ని తరుముతోన్న అధికారులు.. ట్రంప్ ఆగ్రాలో అడుపెట్టే సమయానికి తాజ్ దగ్గర ఒక్క కోతిని కూడా లేకుండా చేస్తామంటున్నారు. అనుకోని విధంగా కోతులు మళ్లీ ఎంటరయ్యే అవకాశాలుండటంతో ట్రంప్ వెళ్లేంతవరకు ఆ ఐదు కొండముచ్చుల్ని కాపలాగా ఉంచబోతున్నట్లు తెలిపారు.