ఆర్జేడీకి భారీ ఎదురుదెబ్బ, ఐదుగురు ఎమ్మెల్సీల రాజీనామా, జేడీయూలో చేరిక, ఫలించిన నితీశ్ వ్యుహాం..
మరికొద్దిరోజుల్లో బీహర్ మండలికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులో జేడీయూ-ఆర్జేడీ ఉన్నాయి. కానీ ఆర్జేడీలో నాయకత్వ లోపం కనిపిస్తోంది. పార్టీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో జైలులో ఉండగా.. పార్టీని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ లీడ్ చేస్తున్నారు. దీంతో సీనియర్ నేతలతో అతనికి పొసగడం లేదు. సీనియర్ నేతలు కొందరు సమయం చూసి మరీ దెబ్బకొట్టారు. ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నట్టు ప్రకటించి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు. దీంతో తేజస్వియాదవ్కు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.
8 నుంచి ముగ్గురికీ..
జూలై 7వ తేదీన బీహర్ మండలికి ఎన్నికలు జరగబోతున్నాయి. విపక్ష ఆర్జేడీకి 8 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికపై మాత్రం తేజస్వి యాదవ్తో పొసగడం లేదు. పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రయోజనం లభించలేదు. దీంతో సంజయ్ ప్రసాద్, ఎండీ కమార్ అలామ్, రాధా చరణ్ సేతు, దిలీప్ రాయ్, రణ్ విజయ్ సింగ్ అనే ఐదుగురు ఎమ్మెల్సీలు జేడీయూలో చేరారు. అయితే ఆర్జేడీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ కూడా పార్టీ పదవీకి రాజీనామా చేయడం.. తేజస్వి యాదవ్తో ఉన్న లుకలుకలు బయటపెట్టాయి.
వారసత్వ రాజకీయాలు..
ఆర్జేడీలో ఉన్న వారసత్వ రాజకీయాలతో విసిగిపోయామని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలో కలిసి పనిచేయలేమని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. పశుదాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటంతో.. ఆయన సూచనమేరకు అభ్యర్థిని నిలిపే అవకాశం ఉంది. అయితే సోమవారం కొందరు రబ్రీదేవి నివాసం వద్ద టికెట్ల కోసం ఆందోళన చేపట్టారు. యాదవులు, ఓబీసీలు కానీ వారికి టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
సీటు కోసం..
ఎమ్మెల్సీ సీటును ఉదయ్ నారాయణ్ రాయ్కి ఇవ్వాలని నేతలు పట్టుబట్టారు. 1970 నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ కోసం టికెట్ త్యాగం చేశారు. కానీ ఆయనకు పార్టీలో సరైన పదవీ ఇవ్వలేదు. దీంతో అతన్ని మండలికి పంపించాలని నేతలు కోరగా... తేజస్వి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్సీలు పార్టీ మారారు.