bengal polls: కాంగ్రెస్-లెఫ్ట్ సభకు భారీగా జనం -నేతల మధ్య సమన్వయ లోపం -ఓట్లు రాలేనా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. కేరళలో ప్రత్యర్థులైన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు.. పశ్చిమ బెంగాల్ లో పొత్తు పెట్టుకుని సీట్ల పంపకాలూ చేసుకున్నాయి. రెండు పార్టీల కలయిక తర్వాత కోల్ కతాలో నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచార సభకు జనం భారీగా పోటెత్తారు. అయితే, వేదికపైనే నేతల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించడంతో కూటమి మనుగడపై కొత్త చర్చ మొదలైంది..
బెంగాల్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్-లెఫ్ట్-ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) కూటమి ప్రయాణం ఆరంభం అదిరిపోయేలా మొదలైంది. అయితే ఆదివారం నాటి కూటమి తొలి బహిరంగ సభలో కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ మధ్య విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. సభలో ఆరంభం నుంచి ఆఖరి వరకు ఐఎస్ఎఫ్ నేత అబ్బాస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక రకమైన ఘర్షణ వాతావరణం కనిపించింది. నేతల మధ్య సమన్వయం తప్పినట్లు కనిపించింది. నిజానికి..
గత లోక్సభ ఎన్నికలకు ముందు కోల్ కతా సహా వెస్ట్ బెంగాల్ లోని కీలక ప్రాంతాల్లో జరిపిన సభలకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. మమత సభలకు ధీటుగా తమ సభలకు జనాన్ని తరలించడంలో లెఫ్ట్ నేతలు సక్సెస్ అయ్యారు. ఆ సభల ఉధృతి చూసి.. లెఫ్ట్ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనేదానిపై అంచనాలు పెరిగాయి. కానీ ఫలితాల్లో లెఫ్ట్ పార్టీలు సున్నాకు మాత్రమే పరిమితం అయ్యారు.
పశ్చిమ బెంగాల్ లో 2016నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు 26 శాతం ఓట్లు దక్కాయి. అదే 2019 లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి లెఫ్ట్ పార్టీల ఓటింగ్ శాతం కేవలం 7.52కు పడిపోయింది. సభలకు వచ్చిన జనాన్ని చూసి అంచనాలు వేసినప్పుడు లెఫ్ట్ పార్టీలకు ఓట్ల శాతం ఇంతగా తగ్గడం, ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
"ఒకరు ఐదు వేర్వేరు ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహిస్తే ఓటర్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓటు అనేది చర్చలో ప్రధాన అంశం. 1977 లో, ఇందిరా గాంధీ ప్రచారం చేసినప్పుడు జనం భారీగా తరలివచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో ఇందిర చిత్తుగా ఓడిపోయారు. అలాగని సభల ప్రభావం ఎన్నికలపై ఉండదని అనలేను కానీ, కేవలం ర్యాలీలు, సభలు మాత్రమే ప్రజల్ని ఆకట్టుకోలేవన్నది నిజం'' అని పశ్చిమ బెంగాల్ పంచాయతీ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ వ్యాఖ్యానించారు.
2019 లోక్ సభ ఫలితాల విశ్లేషణలో.. లెఫ్ట్ కోల్పోయిన ఓట్లన్నీ బీజేపీకి బదిలీ అయినట్లు వెల్లడైంది. మూడేళ్ల క్రితం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి 10.16 శాతం ఓట్లు రాగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40.23 శాతం ఓట్లు వచ్చాయి. మమత నేతృత్వంలోని టీఎంసీని నిలువరించడానికి లెఫ్ట్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా బీజేపీకి పరోక్ష సహకారం అందించాయనే అనూహ్య వాదనలు కూడా పుట్టుకొచ్చాయి. ఎన్నికలను నిర్వహణ, ఓటర్ల తరలిపులో లెఫ్ట్ వెనుకబాటు ఉద్దేశపూర్వకమనే భావన కూడా వ్యక్తమైంది.
అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాను వచ్చే వారంలో విడుదల చేయనుండగా, కాంగ్రెస్, లెఫ్ట్ ఉమ్మడి ర్యాలీకి జనం భారీగా రావడం, ఆ ప్రభావం పోలింగ్ పై ఉంటుందా? ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) కూటమి ఓట్లను రాబడుతుందా? లేక గతంలో మాదిరే ప్రదర్శనలకు పరిమితం అవుతుందా? అనేది వేచిచూడాలి..