హీరో కాళ్లకు మొక్కారు: విలన్ల మృతికి కారణం ఇదేనా...
బెంగళూరు: 'మాస్తిగుడి' కన్నడ చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ సందర్భంగా ఇద్దరు నటులు మృతి చెందిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో కన్నడ చిత్ర పరిశ్రమను విషాద వాతావరణం ఆవరించింది. నిర్లక్ష్యం కారణంగానే ఉదయ్, అనిల్ ఇనే ఇద్దరు విలన్లు మరణించినట్లు భావిస్తున్నారు.
తమకు ఈత రాదు మొర్రో అని మొత్తుకుంటున్నా స్టంట్ డైరెక్టర్ రవి వర్మ వీరిద్దరితో సహజత్వం కోసం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకుండానే సన్నివేశాలను చిత్రీకరించడంపై కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇద్దరు గొప్ప విలన్లను కోల్పోవడం బాధగా ఉందని కన్నడ సాంస్కృతిక శాఖా మంత్రి ఉమశ్రీ ఆవేదన చెందారు. అగ్ర నటులు డాక్టర్ శివరాజ్ కుమార్, కిచ్చ సుదీప్, జగ్గేష్లు కూడా ఈ దారుణ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారిద్దరి కోసం గజఈతగాళ్లు అన్వేషిస్తున్నారు. ప్రత్యేక బోట్లతో గాలిస్తున్నారు. వారిద్దరు సునీల్తో కలిసి తెలుగు సినిమా జక్కన్న సినిమాలో నటించారు.
ఇద్దరిలో ఉదయ్ పెళ్లి చూపులకు వెళ్లి వచ్చాడు
ఇద్దరిలో ఉదయ్ మూడు రోజుల క్రితమే పెళ్ళి చూపులకు వెళ్లివచ్చాడు. తన అక్క, చెల్లె వివాహాలు జరిపి తాను కూడా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నంతలోనే అతన్ని మృత్యువు కాటేసింది. మరో విలన్ అనిల్కు వివాహమై ఇద్దరు బిడ్డలున్నారు. వీరిద్దరి అకాల మృతితో ఆధారం కోల్పోయిన కుటుంబాలు ఆధారం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాయి.
అతను తల్లి కాళ్లకు మొక్కెవాడు..
విలన్ ఉదయ్ ఎక్కడికి వెళ్ళినా ప్రతి రోజూ తన తల్లి కౌశల్యకు చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్లేవాడు. కాని సోమవారం మాస్తిగుడి చిత్రం క్లైమాక్స్కు వెళ్తున్న సమయంలో అమ్మ ఇంట్లో లేని కారణంగా అది సాధ్యం కాలేదు. ఈ విషయాన్ని మీడియాకు చెబుతూ ఉదయ్ తల్లి కౌశల్య కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఉదయ్కు పెళ్ళి చూపుల కోసం దూరపు బంధువులున్న ఆంధ్రహళ్ళికి మూడు రోజుల క్రితం అంతా కలిసే వెళ్ళారు. అయితే ఉదయ్ మాత్రం నేరుగా షూటింగ్కు వెళ్లిపోయాడు.
ఇద్దరు పరిశ్రమలోకి ఒకేసారి..
ఉదయ్, అనిల్లు ఒకేసారి కన్నడ సినీ పరిశ్రమలోకి ఒకసారే ప్రవేశించారు. ఒకసారే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి దేహదారుడ్యాన్ని పెంచుకొని విలన్లుగా ఎదిగారు. వీరు విలన్లుగా నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు సృష్టించాయి.
హీరోలందరితోనూ వారు నటించారు..
కన్నడ నాట అందరూ ప్రముఖ హీరోలతోనూ వీరు నటించారు. పేదరికం అనుభవించి ఎదిగిన వీరిద్దరూ దునియా విజయ్నే తమ పెద్దన్నగా భావించేవారు. హెలికాప్టర్ నుంచి చెరువులోకి దూకే సన్నివేశ చిత్రీకరణ ముందు కూడా వీరిద్దరు విజయ్ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం పొందడం గమనార్హం.