విలన్లకు యాంటీ క్లైమాక్స్: ఒక్క రోజుకు రూ.32 లక్షల ఖర్చు
బెంగళూరు: ఇద్దరు కన్నడ నటులు జలసమాధి కావడానికి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల అనిల్, ఉదయ్ల ప్రాణాలు పోయాయి. మస్తిగుడి సినిమా క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణకు అనుమతి కోసం సినిమా యూనిట్ దాదాపు రెండు నెలల పాటు నిరీక్షించింది. అది క్లైమాక్స్కు బదులుగా యాంటీ క్లైమాక్స్ అయింది.
ఆ ఒక్క రోజు షూటింగ్ కోసం రూ. 32 లక్షలు ఖర్చు చేశారు. అనుమతి కూడా ఏరియల్ షూటింగ్కు మాత్రమే అనుమతి లభించినట్లు తెలుస్తోంది. నీళ్లలో దూకడానికి అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఒక్క రోజు షూటింగ్ కోసం అనుమతి లభించింది. అది కూడా సూర్యాస్తమయం అయ్యే లోగా ముగించాలని షరతు పెట్టారు.
ముందస్తు ప్రాక్టీస్ లేకుండా లైవ్ స్టంట్ చేయాల్సి వచ్చింది. ఆ నటులిద్దరు అందుకు అంగీకరించారు. షూటింగ్ విషయాన్ని తమకు గత సాయంత్రం మాత్రమే తెలియజేశారని, తాము ఉదయం 8 గంటలకు వ్చచామని, రిహార్సల్ చేయడానికి సమయం కూడా లేదని షూటింగ్కు ముందు అనిల్ చెప్పాడు.
ఖర్చులు తగ్గించుకోవడానికి కన్నడ సినీ పరిశ్రమలో నిర్మాతలు రిహార్సల్స్ను, ముందస్తు ప్రాక్జీస్ను వదిలేస్తున్నారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కన్నడ సినీ పరిశ్రమలో ఇతర భాషా పరిశ్రమల్లో మాదిరిగా ఎక్కువ ఖర్చు చేయబోరని, తక్కువ బడ్జెట్తో ఖర్చును తగ్గిస్తూ సినిమాలు తీస్తారని అంటున్నారు.
జలాశయాన్ని పరీక్షించలేదని తాను నమ్ముతున్నట్లు ఓ ప్రముఖ నటుడు అన్నారు. వారిని బయటకు లాగడానికి తగిన రక్షణ చర్యలు కూడా తీసుకోలేదని, ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండిందని, కానీ అది జరగలేదని అన్నారు .
ఫ్రేమ్స్, బ్యాక్ గ్రౌండ్తోనే కొన్ని సార్లు కొరియోగ్రాఫర్లు ముందుకు వెళ్తారని, యాక్షన్ లేదా సాంగ్ సీక్వెన్సెస్లో హేతువు కన్నా సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇచ్చి యాక్టర్లను రిస్క్లోకి నెడుతారని ఆమె అన్నారు. జలాశయం నుంచి అనిల్, ఉదయ్ల మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు మంగళవారంనాడు కూడా గాలింపు చర్యలు సాగిస్తున్నాయి.