ఫోటో జర్నలిస్టుకు చేదు అనుభవం "నువ్వు హిందువా లేక ముస్లింవా" నిర్థారణ కోసం ప్యాంటు విప్పి..!
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు వర్గాల మధ్య గొడవ కాస్త... మతపరమైన ఘర్షణగా మారింది. యువత చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ జాతీయ దినపత్రికకు చెందిన ఫోటో జర్నలిస్టు తను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి చెప్పారు.
Recommended Video
నుదుటిపై బలవంతంగా తిలకం దిద్దారు
మౌజ్పూర్ ఘటనను కవర్ చేసేందుకు తాను వెళ్లినట్లు ఫోటో జర్నలిస్ట్ చెప్పారు. మౌజ్పూర్ మెట్రో స్టేషన్కు సోమవారం మధ్యాహ్నం 12:15 గంటలకు చేరుకోగానే హిందూసేనకు చెందిన వ్యక్తి వచ్చి తన తలపై బలవంతంగా తిలకం దిద్దాడని చెప్పుకొచ్చాడు. అనంతరం " నువ్వు కూడా హిందూ మతానికి చెందినవాడివే. తిలకం నుదుటుపై ఉంటే నీ పని మరింత సులభతరం అవుతుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఫోటో జర్నలిస్టు వెల్లడించారు. తన చేతిలో ఉన్న కెమెరాను చూసి కచ్చితంగా తను ఒక జర్నలిస్టు అని తెలిసి కూడా ఇలా వ్యవహరించాడని చెప్పారు. ఇక 15 నిమిషాలకు ఇరువర్గాలు మౌజ్పూర్లో రాళ్లదాడికి దిగినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో మోడీ మోడీ అంటూ నినాదాలు సైతం వినిపించినట్లు చెప్పారు.
ముందు నువ్వు హిందువు.. ఆ తర్వాతే ఏదైనా..
అప్పటికే ఒక భవనం నుంచి మంటలు చెలరేగుతుండటంతో దాన్ని కవర్ చేసేందుకు వెళ్లగా శివాలయం దగ్గర కొందరు తనను అడ్డుకున్నారని చెప్పారు. "నువ్వు జర్నలిస్టువు కావొచ్చు.. కానీ అంతకంటేముందు ఒక హిందువు అని గుర్తించు. అక్కడ నీకేంటి పని.. ఈరోజు హిందువులు మేల్కొన్నారు" అని అడ్డుకున్న వారిలో ఒకరు తనతో చెప్పిన విషయాన్ని జర్నలిస్టు గుర్తు చేశాడు. ఇక అక్కడి నుంచి పక్కకు వచ్చి చిన్నగా అల్లర్లు జరిగే ప్రాంతానికి చేరుకున్నట్లు వివరించారు. ఇక ఫోటోలు తీస్తున్న సమయంలో నలుగురు కర్రలతో తనను చుట్టుముట్టి తన కెమెరాను లాక్కునే ప్రయత్నం చేసినట్లు ఫోటో జర్నలిస్ట్ వివరించారు. అదే సమయంలో మరో రిపోర్టర్ తనకు అండగా ఉండి దమ్ముంటే ముట్టుకోవాలని సవాల్ విసిరినట్లు చెప్పాడు. ఇక అక్కడి నుంచి తనను ఆ వ్యక్తులు ఫాలో అయ్యారని గుర్తుచేసుకున్నారు.
ఏ మతానికి చెందినవాడో నిర్థారించేందుకు ప్యాంట్ విప్పి..
ఇక కాసేపటికి మళ్లీ అడ్డుకుని నువ్వు హిందువా లేక ముస్లిం మతానికి చెందినవాడివా.. ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నావని ఒక యువకుడు తనను ప్రశ్నించాడని చెప్పాడు ఫోటో జర్నలిస్టు. వెంటనే తన ప్యాంట్ను లాగి తను ఏమతానికి చెందిన వాడినో నిర్థారించుకునే ప్రయత్నం చేశారని ఫోటో జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తను ఒక ఫోటోగ్రాఫర్ను అని చేతులెత్తి నమస్కరించినట్లు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తనను బెదిరించి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక అక్కడి నుంచి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కినట్లు ఫోటో జర్నలిస్టు తన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలాంటి అనుభవం జీవితంలో ఎదుర్కొన లేదు
ఇక ఆటో వెనక వైపు రాసి ఉన్న పేరు చూస్తే ఆటోను అల్లరి మూకలు ఆపుతారని అనుకుంటున్న సమయంలోనే ఆటోను ఆపారని గుర్తుచేసుకున్నాడు ఫోటో జర్నలిస్టు. నలుగురు కలిసి తమ కాలర్లను పట్టుకుని ఆటోలో నుంచి బయటకు లాగారని చెప్పాడు. తాను మీడియాలో పనిచేసే వ్యక్తినని ఆటో డ్రైవర్కు ఏపాపం తెలియదని తమను వదిలివేయాలని ప్రాధేయపడినట్లు చెప్పాడు ఫోటో జర్నలిస్టు. ఇక ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పాడు. ఇలాంటి మతపరమైన చేదు అనుభవం తన జీవితంలో ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తన బాధను పంచుకున్నాడు ఫోటో జర్నలిస్టు.