ఛాన్స్ వస్తే ఆఫ్ఘన్లో పార్లమెంట్ భవనం.. నైజర్లో కన్వెన్షన్ సెంటర్: నేపాల్తోనూ కలిసి పని: మోడీ
న్యూఢిల్లీ: మారిషస్లో కొత్తగా నిర్మించిన ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందట ప్రారంభించారు. మారిషస్ ప్రధానమంత్రి ప్రవీంద్ జగన్నాథ్తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కీలకోపన్యాసం చేశారు. భారత్-మారిషస్ మధ్య ఉన్న దౌత్యసంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాల కాలంగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. నిఖార్సయిన ప్రజాస్వామ్యం వ్యవస్థకు భారత్, మారిషస్ ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటోన్న దేశంగా..
ప్రాణాంతక కరోనా వైరస్ను మారిషస్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని నరేంద్రమోడీ ప్రశంసించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య చక్కని సమన్వయం ఉందని అన్నారు. ప్రజల సహకారంతోనే ఆ దేశం కోవిడ్పై అసమాన పోరు కొనసాగిస్తోందని, విజయం సాధిస్తోందని చెప్పారు. మారిషస్కు అవసరమైన మందులను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నామని, అనుభవాలను ఇచ్చిపుచ్చుకుంటున్నామని అన్నారు. మారిషస్ ప్రజలకు నైతిక స్థైర్యాన్ని ఇస్తున్నామని మోడీ చెప్పుకొచ్చారు.
సాగర్ ప్రాజెక్టుపై
సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ (సాగర్) ప్రాజెక్టును చేపట్టడానికి ముందు తాను మొట్టమొదటిసారిగా మారిషస్ ప్రధానమంత్రితో మాట్లాడానని నరేంద్ర మోడీ చెప్పారు. హిందూ మహాసముద్రం మీదుగా భారత్ రాకపోకలు సాగించాలంటే మారిషస్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. హిందూ మహా సముద్రం రీజియన్కు మారిషస్ గుండెకాయలా ఉంటోందని చెప్పారు. భారత్, మారిషస్ మధ్య అనేక అంశాల్లో సారూప్యత ఉందని అన్నారు. అభివృద్ధి, పరస్పర సహకారంతో ఇరు దేశాలు పురోగమించాలని అకాంక్షిస్తున్నట్లు మోడీ చెప్పారు.
ఆప్ఘనిస్తాన్లో పార్లమెంట్ భవనం..
ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి అవకాశం అంటూ లభిస్తే.. దాన్ని గౌరవంగా భావిస్తామని నరేంద్ర మోడీ చెప్పారు. ఆఫ్రికా దేశమైన నైజర్లో జాతిపిత మహాత్మాగాంధీ పేరు మీద కన్వెన్షన్ సెంటర్ను నిర్మించే అవకాశం వస్తుందని భావిస్తున్నానని అన్నారు. మహాత్మాగాంధీ పేరు మీద కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సహకరించే అవకాశం లభించడాన్ని గర్వంగా తీసుకుంటామని చెప్పారు. మారిషస్ వంటి మిత్ర దేశాల సహాయ, సహకారాలతో భారత్ మరిన్ని విజయాలను అందుకోగలదనే ధీమాను మోడీ వ్యక్తం చేశారు.
Recommended Video
అన్ని రంగాల్లోనూ పురోగమనం
మిత్రదేశాల సహకారాన్ని రాజకీయ, వ్యాపార దృష్టితో చూడకూడదని మోడీ అన్నారు. వాణిజ్యం, క్రీడలు, మౌలిక వసతుల కల్పన వంటి అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా తమ మంచిని కోరే దేశాలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఆప్ఘనిస్తాన్, నైజర్తో పాటు నేపాల్లో ఆ దేశ వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అవకాశం లభించినా దాన్ని స్వీకరిస్తామని అన్నారు. అత్యవసర, ట్రామా ఆసుపత్రులను నిర్మించడానికి సహకరిస్తామని అన్నారు.