బీహార్ ఎన్నికలకు మావోల ముప్పు- నిఘా హెచ్చరికలతో నేతలు అప్రమత్తం
బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఓవైపు కరోనా ముప్పు, మరోవైపు మావోయిస్టుల ముప్పు ఈ ఎన్నికలకు అవరోధంగా మారుతున్నాయి. ఇప్పటికే కరోనా నియంత్రణకు పలు చర్యలు తీసుకున్న ఈసీకి.. స్ధానిక రాజకీయ నేతలకు మావోయిస్టుల ముప్పు ఉందంటూ నిఘా వర్గాలు చేస్తున్న హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
బీహార్లో తొలిదశ పోలింగ్ ఈ నెల 28న జరగబోతోంది. 71 అసెంబ్లీ స్ధానాల్లో జరిగే పోలింగ్ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తొలిదశ ఎన్నికల ప్రచారం కూడా హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో మునిగిపోయి ఉన్న రాజకీయ నేతల్ని మావోయిస్టులు టార్గెట్ చేసే అవకాశమున్నట్లు నిఘా సంస్ధలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కేంద్రం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో బీహార్ ఎన్నికలే లక్ష్యంగా కౌంటర్ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
బీహార్ ఎన్నికల్లో దాడులకు పాల్పడటం ద్వారా ఎన్నికల ప్రక్రియనే లక్ష్యంగా చేసుకోవాలని మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలకు తాజాగా సమాచారం అందింది. ఐఈడీలు, ల్యాండ్మైన్ల ద్వారా పేలుళ్లకు పాల్పడి నేతలను హతమార్చేందుకు వీరు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల టార్గెట్లో బీహార్లోని వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా హెచ్చరికలతో ఇప్పుడు వీరందరికీ భద్రత పెంచారు.