డెల్టా ప్లస్ వేరియస్ యమడేంజర్: వ్యాక్సిన్ వేసినా, యాంటీబాడీలను ఓడించే శక్తి, థర్డ్ వేవ్లో ప్రభావం!
న్యూఢిల్లీ: భారతదేశంలో సెకండ్ వేవ్లో అత్యధిక కేసులు, మరణాలు సంభవించడానికి కరోనావైరస్ డెల్టా వేరియంట్(బీ.1.617.2) కారణమని వైద్య నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఇప్పుడు డెల్టా ప్లస్ లేదా ఏవై.01 వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇది మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.
డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం
ఐఎన్ఎస్ఏసీఓజీ మాజీ సభ్యుడు, ప్రముఖ వైరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ షాహీద్ జమీల్ డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సినేషన్ వల్ల లభించిన ఇమ్యూనిటీని, మానవ శరీరంలోని సహజ ఇమ్యూనిటీని కూడా ఎదుర్కొనే శక్తి డెల్టా ప్లస్ వేరియంట్కు ఉందని స్పష్టం చేశారు.
ఈ వేరియంట్పై ప్రభావం చూపని ఆస్ట్రాజెనికా..
కరోనావైరస్ లక్షణాలతోపాటు సౌతాఫ్రికాలో వెలుగు చూసిన బెటా వేరియంట్(కే417ఎన్) లక్షణాలను కూడా కలిగివుందన్నారు. బెటా వేరియంట్పై ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు ప్రభావం చూకపోవడంతో సౌతాఫ్రికా ప్రభుత్వం ఆ కంపెనీకి ఇచ్చిన కన్సైన్మెంట్ను రద్దు చేసుకుందన్నారు. అయితే, డెల్టా ప్లస్ వేరియంట్ అనేది వేగంగా వ్యాప్తి చెందుతుందా? లేదా? అనేది ఇంకా తేలలేదన్నారు జమీల్.
మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కీలకం..
అత్యధిక జనాభా ఉన్న భారత్ లాంటి దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ గుర్తించడం కూడా కష్టమేనని జమీల్ తెలపారు. డెల్టా ప్లస్.. యాంటీబాడీ, వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి రెండింటికీ నిరోధకతను కలిగి ఉందన్నారు. అయితే కోవిడ్ పురోగతి చెందకుండా నిరోధించే.. రోచె,సిప్లా భారతదేశంలో విక్రయించే కొత్త మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స వంటివి కూడా ఉన్నాయని ప్రొఫెసర్ జమీల్ పేర్కొన్నారు. ప్రాధమిక ఫలితాలను ఆశాజనకంగా చూపించారు. గత ఏడాది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కూడా ఇదే చికిత్స అందించారిన తెలిపారు.
సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్.. థర్డ్ వేవ్ డెల్టా ప్లస్ వేరియంట్ వంతు
కాగా, దేశంలో సెకండ్ వేవ్ విజృంభణకు కరోనావైరస్ డెల్టా వేరియంట్ కారణం కాగా.. డెల్టా పస్ల్ వేరియంట్తో థర్డ్ వేవ్ వ్యాప్తి జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఖచ్చితంగా డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి ఉంటుందని చెప్పలేమని అంటున్నారు. సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ మరింత తీవ్రంగా ఉంటుందా? అనేది ఈ వేరియంట్ వ్యాప్తిపై ఆధారపడిందని చెబుతున్నారు. అయితే, భారత వైద్య నిపుణులు, ప్రభుత్వం సరైన విధంగా స్పందించి థర్డ్ వేవ్ను కట్టడి చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.