కాంగ్రెస్ది అధికార దాహం! బీజేపీ ఓటమి ఖాయం! మాయావతి
దియోబంద్ : ఉత్తర్ప్రదేశ్లో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమి దూకుడు పెంచింది. దియోబంద్ వేదికగా తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఉమ్మడిగా నిర్వహించిన సభలో పాల్గొన్న మాయావతి, అఖిలేష్, అజిత్ సింగ్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ఎంత మంది చౌకీదార్లు వచ్చినా బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పిన నేతలు... కాంగ్రెస్కు ఓటేసి ముస్లిం ఓట్లు చీల్చవద్దని ఓటర్లకు అప్పీల్ చేశారు.
పిల్ల చేష్టలతో ఎన్నికలు గెలవలేరు.. దోచుకున్న ప్రతి పైసాకు మమత లెక్క చెప్పాలన్న మోడీ
బీజేపీకి ఓటమి తప్పదు
విద్వేషపూరిత విధానాలు అమలు చేస్తున్న బీజేపీకి ఈసారి ఎన్నికల్లో ఎదురుదెబ్బ ఖాయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. చిన్న, పెద్ద చౌకీదార్లు ఎంత మంది వచ్చినా ఆ పార్టీ ఓటమిని ఎవరూ ఆపలేరని చెప్పారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ద్వేషపూరిత విధానాలను దేశంలో ప్రవేశపెట్టిన ఘనత బీజేపీదేనని బెహన్ జీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముస్లిం ఓట్లు చీల్చవద్దని అప్పీల్
కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ పథకంపై మాయావతి విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని పోటీలో నిలిపిందని మాయా విమర్శించారు. బీజేపీకి పోటీనిచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదన్న ఆమె ముస్లిం ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి ఓటు వేయాలని అప్పీల్ చేశారు.
కాంగ్రెస్కు అధికార దాహం
కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకదానికొకటి ప్రతిరూపాలని విమర్శించారు. ఆ పార్టీ మార్పు కోరుకోవడంలేదని.. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తోందని అఖిలేష్ ఆరోపించారు.