కన్ఫ్యూజ్ చేయకండి: కాంగ్రెస్ పార్టీ ఆఫర్పై మాయావతి తీవ్ర హెచ్చరిక
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని 80 లోకసభ స్థానాలకు గాను ఏడు చోట్ల తాము పోటీ చేయడం లేదని, వాటిని ఎస్పీ, బీఎస్పీ కూటమికి వదిలేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఏడు సీట్లు వదిలేసినట్లుగా చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేయవద్దని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పోటీ చేసే రాయ్బరేలి, ఆమేథిలలో తాము పోటీ చేయమని ఎస్పీ, బీఎస్పీ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. తాజాగా, ఎస్పీ, బీఎస్పీల ఫ్యామిలీల కోసం కాంగ్రెస్ ఏడు సీట్లను వదిలేస్తున్నట్లు చెప్పింది.
కన్ఫ్యూజ్ చేస్తున్నారు
కాంగ్రెస్ తమ కూటమికి ఏడు స్థానాలు వదిలేయడంపై మాయావతి స్పందించారు. ఉత్తర ప్రదేశ్లో మొత్తం 80 లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. తమ కూటమి బీజేపీని ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ తమకు త్యాగం చేసినట్లుగా ఏడు సీట్లు వదిలేయడం అవసరం లేదని చెప్పారు. తాను మరోసారి చెబుతున్నానని, ఉత్తర ప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా తమకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్పీ కేడర్ కాంగ్రెస్ చెప్పే అబద్దాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కేడర్ను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గందరగోళం సృష్టించవద్దు
సమాజ్వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫర్ పైన స్పందించారు. తమ ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి బీజేపీని ఓడిస్తుందని విశ్వాసం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గందరగోళం సృష్టించవద్దని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఏం చెప్పిందంటే
మెయిన్పురి, కనౌజ్లతో పాటు మాయావతి, ఆర్ఎల్డీ నేతలు అజిత్ సింగ్, జయంత్ చౌదరి తదితరులు పోటీ చేయనున్న 7 స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి కోసం తాము ఏడు స్థానాలు వదిలేశామని చెప్పారు. ఇందులో మెయిన్పురి, కనౌజ్, పిరోజాబాద్లతో పాటు మాయావతి, జయంత్, అజిత్ సింగ్లు పోటీ చేయనున్న స్థానాలను తాము వారికి వదిలేశామని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ ప్రకటించారు. తాము అప్నాదళ్కు గోండా, ఫిల్బిత్ రెండు స్థానాలు ఇస్తామని చెప్పారు.