2 దశాబ్ధాల బద్ద శత్రువులు..! కలగా గడిచిన 24 ఏళ్లు.. ఒకే వేదిక పైకి ములాయం, మాయావతి
మైన్పురి : రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇది ఒక రకంగా వాస్తవంలా కనిపిస్తుంది. నేతలు ఏ పార్టీలో ఉన్నా.. మైకులు విరగ్గొట్టేంత వరకే శత్రువులా నటిస్తారని చెప్పొచ్చు. ఆపై ఒకరికి మరొకరు తోడుగా తమ పనులు చక్కదిద్దుకునే పరిస్థితి కనిపిస్తుంటుంది. అయితే ఎస్పీ, బీఎస్పీ అధినేతల మధ్య రాజుకున్న వివాదం వారిద్దరిని రెండు దశాబ్ధాలకు పైగా దూరం చేసింది. 24 ఏళ్లుగా వారు కలిసిన సందర్భాలు లేవు.
మాటల్లేక సిల్వర్ జూబ్లీ
రాజకీయంలో శత్రుత్వం తక్కువనే చెప్పాలి. ఎన్నికల వేళనో, ఇతరత్రా సందర్భాల్లో మాత్రమే నేతలు ఒకరినొకరు తిట్టిపోసుకుంటారు. ఆ తర్వాత ఎక్కడ కలిసినా మర్యాదపూర్వకంగా మాట్లాడుకుంటారు. అయితే సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి మధ్య రెండు దశాబ్ధాలకు పైగా వైరం నడుస్తోంది. 1995 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 24 ఏళ్లు వారి మధ్య మాటల్లేవు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
రెండు దశాబ్ధాల వైరానికి తెరదించుతూ శుక్రవారం (19.04.2019) ఉత్తరప్రదేశ్ లో సరికొత్త రాజకీయ చిత్రం ఆవిష్కృతం కానుంది. 24 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు అగ్రనేతలు చేతులు కలపనున్నారు. ఎస్పీ కంచుకోటైన మైన్పురిలో భారీ ర్యాలీ జరగనుంది. క్రిస్టియన్ ఫీల్డ్ మైదానంలో ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ నిర్వహించనున్న మహా ర్యాలీలో ములాయం, మాయావతి కలిసి కనిపించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేకంగా తమ కూటమి బలమేంటో చూపించడానికి మూడు పార్టీల నేతలు సిద్ధమయ్యారు.
వెంటాడిన ఆనాటి ఘటన
1995 నాటి ఘటన ఈ అగ్రనేతల మధ్య దూరం పెంచింది. విశ్రాంతి గృహంలో ఉన్న మాయావతితో పాటు బీఎస్పీ కార్యకర్తలపై సమాజ్వాదీ పార్టీ క్యాడర్ విరుచుకుపడింది. విచక్షణరహితంగా దాడులు చేశారనే ఆరోపణలున్నాయి. ఆనాటి నుంచి ఈ రెండు పార్టీల అగ్రనేతల మధ్య దూరం పెరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరు ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు లేవు. పొత్తులు కొనసాగుతున్నప్పటికీ ఈ ఇద్దరు మాత్రం మాట్లాడుకోకపోవడం గమనార్హం.
మైన్పురి బరిలో ములాయం.. అందుకేనా స్నేహ హస్తం
శుక్రవారం నాడు ఒకే వేదికపై ఇద్దరు అగ్రనేతలు మళ్లీ ఒక్కటై కనిపించబోతున్నారనే వార్త దేశవ్యాప్తంగా ఆసక్తి రేపింది. అదలావుంటే లోక్సభ ఎన్నికల పర్వంలో భాగంగా ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి ఇప్పటివరకు నిర్వహించిన దేవ్బంద్ (ఏప్రిల్ 7), బదౌన్ (ఏప్రిల్ 13), ఆగ్రా (ఏప్రిల్ 16) లో జరిగిన మూడు ర్యాలీలకు ములాయం హాజరు కాకపోవడం గమనార్హం. అయితే మైన్పురి నుంచి ఆయన బరిలో నిలవడంతో.. శుక్రవారం నాడు జరిగే ర్యాలీలో ఆయన తప్పనిసరి పాల్గొనాల్సి ఉంది.
మాట్లాడుకుంటారా?.. మళ్లీ మౌనమేనా?
మాయావతితో వైరం నేపథ్యంలో శుక్రవారం నాడు మైన్పురిలో జరిగే ర్యాలీకి కూడా దూరంగా ఉండాలని ములాయం భావించారట. కానీ ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ సర్దిచెప్పడంతో పెద్దాయన కాస్తా మెత్తబడ్డారనే ప్రచారం జరుగుతోంది. ములాయం నుంచి అనుమతి తీసుకున్నాకే.. ఆయన శుక్రవారం నాటి ర్యాలీకి వస్తున్నట్లు ప్రకటించారు అఖిలేశ్. మొత్తానికి 24 ఏళ్లు కలగా గడిచిపోయి ములాయం, మాయావతి ఒకే వేదికను పంచుకోబోతున్నా.. వీరిద్దరి మధ్య మళ్లీ మౌనం రాజ్యమేలుతుందా? లేదంటే మాటల సందడి కనిపిస్తుందా? వెయిట్ అండ్ సీ.