సుప్రీంకోర్టులో మాయావతికి చుక్కెదురు ఈసీ ఇప్పటికైనా మేల్కొందన్న చీఫ్ జస్టిస్
Recommended Video
ఢిల్లీ : ఎన్నికల సమయంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈసీ ఇప్పటికైనా మేల్కొందని వ్యాఖ్యానించింది. మరోవైపు 48గంటల పాటు ప్రచారంపై నిషేధం విధించడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కోర్టు మెట్లెక్కారు. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె దాఖలు చేసిన పిటీషన్పై స్పందించిన న్యాయస్థానం విచారణకు నిరాకరించింది.
వెల్లూరు లోక్సభ ఎన్నికలు రద్దా?.. కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటోంది?
ఈసీ నిర్ణయంపై మాయావతి సవాల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయావతి ముస్లింలంతా ఎస్పీ, బీఎస్పీ కూటమికే ఓటు వేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తంకావడం మరోవైపు విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. 48 గంటల పాటు మాయావతి ప్రచారంపై నిషేధం విధించింది. దీనిపై మాయా సుప్రీంకోర్టును ఆశ్రయించగా... ఆమె పిటీషన్పై విచారణకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. కావాలంటే మరో వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని సూచించింది.
ఈసీ చర్యలపై సంతృప్తి
విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలపై సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈసీ ఇప్పటికైనా మేల్కొని చర్యలు తీసుకుందని అభిప్రాయపడింది. ఈసీ చర్యలు ప్రారంభించినందున ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
సుప్రీం ఆగ్రహంతో ఈసీ చర్యలు
విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఈసీ వైఖరిని తప్పుబడుతూ సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్నికల సంఘం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్లపై 72గంటలు, బీఎస్పీ చీఫ్ మాయావతి, బీజేపీ నేత మేనకాగాంధీ 48గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది.