రాజస్థాన్లో మొత్తం 200 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం: బీఎస్పీ
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పెరిగింది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండగా మరికొన్ని పార్టీలు టికెట్ కేటాయింపుల పనుల్లో బిజీగా ఉన్నాయి. రాజస్థాన్లో ఈసారి ఎన్నికలు చాలా ఆసక్తికరగా మారనున్నాయి. వసుంధర రాజే ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ కాంగ్రెస్ పాగా వేసే అవకాశమున్నట్లు పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇక రాజస్థాన్లో 200 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తమ పార్టీనుంచి అభ్యర్థులు బరిలోకి దిగుతారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. దీంతో ఎన్నికలు మరింత రంజుగా మారనున్నాయి.
200 సీట్లలో పోటీ చేయనున్న బీఎస్పీ
రాజస్థాన్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు పోరు బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే కొనసాగుతుండగా మాయావతి ఎంట్రీతో ఎలక్షన్స్ మరింత ఇట్రెస్టింగ్గా మారనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు ఉండదని తేల్చేసిన బెహన్జీ తాజాగా తమ పార్టీ 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటన చేసింది. రాజస్థాన్లో ఎన్నికలు డిసెంబర్ 7న జరగనున్నాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఓవరాల్గా 3.37శాతం ఓట్లు సంపాదించింది.ఇది 2008 ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను నెగ్గడంతోపాటు 7.60శాతం ఓట్లు సంపాదించింది.
విజయం కోసం వ్యూహాలు
బీఎస్పీ పార్టీ మొత్తం 200 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలుపుతుందని... విజయం కోసం ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు దుంగర్రం గెదార్ తెలిపారు. 2013లో తమ పార్టీ 195 నియోజకవర్గాల్లో పోటీచేసిందని గుర్తు చేశారు. మాయావతి ఎన్నికల ప్రచారం నిర్వహించగానే అసెంబ్లీ సీట్ల కేటాయింపులు జరుగుతాయని ఆయన తెలిపారు. 2018లో గెలిచే సీట్లు పెరగాలని ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నామని దుంగర్రం తెలిపారు. బీజేపీతో ప్రజలు విసుగెత్తిపోయారని... కాంగ్రెస్పై వారికి ఆశలు లేవని మరో బీఎస్పీ నేత భగ్వంత్ సింగ్ వెల్లడించారు.
పలు జిల్లాల్లో మాయావతి బహిరంగ సభలు
పార్టీ అధినేత్రి మాయావతి పలు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహిస్తుందని బీఎస్పీ పార్టీ ప్రతినిధులు తెలిపారు. తూర్పు రాజస్థాన్లోని భరత్పూర్, ధోల్పూర్, కరౌలి, సవైమధోపూర్, అల్వార్ జిల్లాలో బెహన్ జీ ప్రచారం నిర్వహిస్తారని ఆ తర్వాత ఉత్తర రాజస్థాన్ ప్రాంతంలోని హనుమాన్ఘర్, శ్రీగంగానగర్, బికనేర్, జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎస్సీ వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ ఈ ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 200 నియోజకవర్గాల్లో 34 ఎస్సీ సామాజిక వర్గం, 25 ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి రిజర్వ్ సీట్లున్నాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఇది కాంగ్రెస్ను ఇరుకున పెడుతుందని పార్టీ తెలిపింది.
ఇవీ రాజస్థాన్లో బీఎస్పీ లెక్కలు
1990 నుంచి రాజస్థాన్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ పోటీచేస్తోంది. అయితే 1998లోనే తొలిసారిగా పార్టీనుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. 1998లో 108 మంది అభ్యర్థులను పార్టీ బరిలోకి దింపి 2.17శాతం ఓటు షేరును పొందింది. 2003 ఎన్నికల్లో బీఎస్పీ 124 నియోజకవర్గాల్లో పోటీ చేయగా రెండు సీట్లు మాత్రమే నెగ్గింది. 2008లో ఆరుమంది అభ్యర్థులు బీఎస్పీ తరపున గెలిచారు. ఆ సమయంలో 7.60 శాతం ఓట్లు సంపాదించింది. అయితే గెలిచిన ఆరుమంది అభ్యర్థులు అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్లో చేరి అశోక్ గెహ్లాట్కు మద్దతుగా నిలిచారు.