అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్: మాయావతి, టార్గెట్ బిజెపి!
లక్నో: బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి.. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్పీ అధికారంలోకి వస్తే అగ్రవర్ణాల పేదలకు విద్య, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను కేటాయించనున్నట్లు మంగళవారం హామీ ఇచ్చారు.
బీహారులో అగ్రకులాల పేదల సామాజిక, ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా నిరుపేదల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఆమె రోహటాస్ జిల్లాలోని కరాఘర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కాగా, మాయావతి హామీల పైన రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీహార్లో ప్రధాని మోడీని, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని దెబ్బతీసే ఉద్దేశ్యంలో భాగంగానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
బీహార్ ఎన్నికల్లో బిఎస్పీకి గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవు. ఒకవేళ మహాకూటమి లేదా ఎన్డీయే కూటమికి మెజార్టీ రాకుంటే బిఎస్పీ ఏమైనా సీట్లు గెలిస్తే ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశాలుంటాయి. కానీ, బిఎస్పీకి ఆ సీట్లు కూడా గెలిచే అవకాశం లేదని, పైగా ఇప్పటికే ములాయం నేతృత్వంలోని తృతీయ కూటమి మెజార్టీ రాకుంటే షరతులతో కూడిన మద్దతుకు అవకాశాలున్నాయంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మాయావతి అగ్రవర్ణ రిజర్వేషన్లు బిజెపిని దెబ్బతీసేందుకే అంటున్నారు. అగ్రవర్ణాలు బిజెపి వైపు మొగ్గు చూపుతారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో బిజెపి వైపు వెళ్లే ఓట్లను చీల్చే ఉద్దేశ్యంలో భాగంగానే ఆమె అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అని చెప్పి ఉంటారంటున్నారు.